డిప్యూటీ సీఎం నారాయణస్వామికి.... ఎక్కడికి వెళ్లినా నిరసన సెగలు తగులుతున్నాయి. ఇప్పటి వరకు జనం ఆయన్ను అడ్డుకుంటే, ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం గుంటిపల్లె గ్రామంలో జరిగింది. మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి వర్గీయుల మధ్య రాజకీయ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పెనుమూరు మండలంలో పర్యటిస్తున్న నారాయణస్వామిని తమ గ్రామానికి రావద్దంటూ.. గుంటిపల్లెకు వెళ్లే మార్గంలో వైసీపీ నేతలు, ముళ్ల కంచె, రాళ్లను అడ్డుగా పెట్టారు. దీంతో అసహనానికి గురైన నారాయణస్వామి.. వైసీపీ కార్యకర్తలపై మండిపడ్డారు. అయితే వైసీపీ కార్యకర్తలు మాత్రం ఇవేవి పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కావడంతోనే నారాయణస్వామి పొర్లుదండాలు పెట్టి ఓట్లు అడుక్కునేందుకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఆయన తమ గ్రామానికి రావాల్సిన అవసరంలేదన్నారు వైసీపీ కార్యకర్తలు. ఆయన వస్తున్నారని తెలుసుకున్న యువకులు గ్రామానికి ఇరువైపులా ఉన్న మార్గాల్లో ముళ్లకంపలు, రాళ్లు అడ్డంగా పెట్టారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ నిరసన చేశారు. చేసేది లేక తిరిగి వెళ్లిపోయారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com