YCP: ఈ వైసీపీ కార్పొరేటర్ భర్త.. ఓ జేబు దొంగ

YCP: ఈ వైసీపీ కార్పొరేటర్ భర్త.. ఓ జేబు దొంగ

ఆయన వైసీపీ కార్పొరేటర్‌ భర్త. అందరిలా భార్య రాజకీయం జోలికి ఆయన వెళ్లడు. ఎక్కడ బహిరంగ సభలు ర్యాలీలు, ఉత్సవాలు ఉంటే అక్కడికెళ్లి జనాల జేబులు కొట్టేస్తాడు. క్షణాల్లో డబ్బును చేతులు మార్చేస్తాడు. తాజాగా చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు గుమిగూడిన జనం వద్ద చేతివాటం ప్రదర్శించి దొరికిపోయాడు. విజయవాడ 47వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్‌ గోదావరి గంగ భర్త గోదావరిబాబు. బుధవారం తెల్లవారుజామున చంద్రబాబును చూసేందుకు వచ్చిన జనాల్లో కలిసిపోయారు. వైసీపీ కార్పొరేటర్‌ భర్తై ఉండి చంద్రబాబును చూడడానికి వెళ్లారు. చంద్రబాబును చూసేందుకు తెలుగుదేశం శ్రేణులంతా గుమిగూడి ఉండగా గోదావరి బాబు ఓ నేత జేబులోని 20 వేలు కాజేశారు. ఆ డబ్బును తన వెంట తెచ్చుకున్న మరో మనిషికి ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. ఈ విషయాన్ని తెలుగుదేశం కార్యకర్తలు గుర్తించేసరికి పారిపోయే ప్రయత్నం చేశాడు. జనం అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు.


బందోబస్తు విధుల్లో ఉన్న కృష్ణలంక సీఐ దుర్గారావు అక్కడకు చేరుకుని గోదావరి బాబును అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడిని కృష్ణలంక స్టేషన్‌కు తరలించారు. నగదు తనవద్ద లభించకపోవడం, ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు వైసీపీ నాయకుడిని బైండోవర్‌ చేసి వదిలేశారు. ఇటీవల నెల్లూరులోని ఓ మంత్రి చరవాణిని తస్కరిస్తూ పట్టుబడడంతో అక్కడి పోలీసులు గోదావరి బాబుపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అప్పటి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్రలోనూ తన హస్తలాఘవాన్ని ప్రదర్శించి దొరికిపోయినట్లు సమాచారం. గోదావరి బాబు 12 ఏళ్ల క్రితమే విజయవాడ వచ్చాడు. తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై గతంలో కేడీ షీట్‌ ఉంది. అది ప్రస్తుం గోదావరిబాబు నివసిస్తున్న కొత్త పేట పీఎస్‌కు బదిలీ కాలేదు. రెండు చోట్లా నిఘా లేకపోవడంతో గోదావరిబాబు హస్త లాఘవానికిఅడ్డులేకుండా పోయింది.

Next Story