AP: మహిళపై వైసీపీ నేత దాష్టీకం

AP: మహిళపై వైసీపీ నేత దాష్టీకం

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురం గ్రామంలో మహిళపై స్థానిక వైసీపీ నేత అత్యాచారయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది. దీనిపై ఆమె గట్టిగా నిలదీయడంతో మనసులో పెట్టుకున్న ఆ వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. పాల వెంకటాపురం గ్రామానికి చెందిన నటరాజు అనే వ్యక్తి మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంలో నిలదీయడంతో లక్ష్మీపై అతను దాడి చేశాడు. బ్రహ్మసముద్రం మండలం గొల్లదొడ్డికి చెందిన వివాహిత పాలవెంకటాపురంలో దుస్తుల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం దుకాణం మూసేసి చెరువు కట్ట మీదుగా గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా స్థానిక వైసీపీ నాయకుడు, గ్రామ సచివాలయం కన్వీనర్‌ నటరాజ్‌ ఆమెను అడ్డుకుని అత్యాచారం చేయబోయాడు. తీవ్రంగా ప్రతిఘటించడంతో విచక్షణరహితంగా దాడి చేశాడు. జుట్టు పట్టుకుని ఈడ్చి.. కాలితో తన్ని క్రూరంగా ప్రవర్తించాడు. పక్కనే పొలంలో పనిచేసుకుంటున్న ఓ రైతు అక్కడికి చేరుకుని ఆమెను విడిపించడానికి ప్రయత్నించాడు. అతనిపైనా నటరాజ్‌ దాడి చేశాడు. కొద్దిసేపటికి మరి కొంతమంది అక్కడికి చేరుకోవడంతో పరారయ్యాడు.


ఈ దృశ్యాలను అక్కడే ఉన్న వ్యక్తి చిత్రీకరించాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఈ ఘటన జరిగినట్లు పోలీసుల దృష్టికి రావడంతో బ్రహ్మసముద్రం ఎస్సై పరశురాముడు ఆధ్వర్యంలో పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఘటనా స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. దాడి జరిగిందని నిర్దారించకున్నారు. లక్ష్మీపై దాడి చేసిన నటరాజుపై బ్రహ్మసముద్రం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పరశురాముడు తెలిపారు. గాయపడిన మహిళను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని ఎస్సై పేర్కొన్నారు. నిందితుడు నటరాజ్‌పై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

Next Story