Badminton: తొలి మ్యాచ్‌లో గెలిచిన పీవీ సింధు, లక్ష్యసేన్

Badminton: తొలి మ్యాచ్‌లో గెలిచిన పీవీ సింధు, లక్ష్యసేన్

బ్యాడ్మింటన్ కెనడా ఓపెన్‌-2023లో భారత షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌లు భారత్‌కు శుభారంభం అందించారు. వీరిద్దరూ మొదటి రౌండ్‌లో గెలిచి, రెండవ రౌండ్‌కి చేరుకున్నారు. పీవీ సింధు తదుపరి రౌండ్‌ ఆఫ్ 16లో 27వ ర్యాంకు జపాన్ క్రీడాకారిణి నత్సుకీ నిదైరాతో తలపడనుంది.

భారత ఒలంపిక్ పతక విజేత పీవీ సింధు మొదటి రౌండ్‌లో 21-16, 21-9 తేడాతో కెనడా క్రీడాకారిణి తాలియాపై సునాయసంగా గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ థాయ్‌లాండ్‌కు చెందిన వరల్డ్ నంబర్ 4 ఆటగాడు కున్లావట్ వితిద్‌సర్న్‌పై 21-18, 21-15 తేడాతో నెగ్గి సంచలనం సాధించాడు.


మహిళల సింగిల్స్‌ మొదటి మ్యాచ్‌లో సింధు మొదటి సెట్ గెలవడానికి శ్రమించాల్సి వచ్చింది. ప్రత్యర్థి కూడా ధీటుగా ఆడటంతో మొదటి సెట్‌ టైగా ముగిసింది. తన పవర్ షాట్లతో పాయింట్ గెలిచి మొదటి సెట్‌ ఖాతా వేసుకుంది. రెండవ సెట్‌లో 4-0 ఆధిక్యంతో ఆరంభించి, అనంతరం 7 వరుస పాయింట్లతో సెట్‌ని సునాయసంగా గెలిచి, మ్యాచ్‌లో విజయం సాధించింది.

పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లో భారత ఆటగాడు లక్ష్యసేన్, టోర్నీలో రెండవ సీడ్‌ ఆటగాడు కున్లావట్‌పై తీవ్రంగా శ్రమించి గెలిచాడు. ఇద్దరు ఆటగాళ్లు మొదటి రౌండ్‌ నుంచీ హోరాహోరీగా తలపడ్డారు. ఒత్తిడిని జయించిన లక్ష్యసేన్‌ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక మరో సింగిల్స్ మ్యాచ్‌లో భారత ఆటగాడు సాయిప్రణీత్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. బ్రెజిల్ ఆటగాడి చేతిలో 21-12, 21-17 తేడాతో ఓడిపోయాడు. ఇతను లక్ష్యసేన్‌తో రెండవ రౌండ్‌లో తలపడనున్నాడు. మహిళా షట్లర్ గద్దె రుత్విక కూడా సింగిల్స్‌లో పరాజయం పాలైంది. థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి సుపపిద చేతిలో 21-12, 21-3 తేడాతో ఓటమి పాలైంది. 2014 కామన్‌వెల్త్ బంగారు పతక విజేత, తెలుగు ఆటగాడు పారుపల్లి కశ్యప్ అర్హత పోటీల నుంచి వైదొలిగాడు.

Tags

Read MoreRead Less
Next Story