MI vs RR: జైస్వాల్ సూపర్ సెంచరీ.. రాజస్థాన్ గెలుపు

MI vs RR: జైస్వాల్ సూపర్ సెంచరీ.. రాజస్థాన్ గెలుపు
సందీప్‌శర్మకు ఐదు వికెట్లు

ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. 18.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 183 పరుగులు చేసి తమ ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీతో రాణించడంతో అలవోకగా విజయం సాధించింది. జైస్వాల్ (104*) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 7 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. తన భాగస్వామి సంజూ శాంసన్ (38*)పరుగులతో రాణించాడు. బట్లర్ (35) పరుగులు చేశాడు.

ముంబై బౌలర్లు.. రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. కేవలం పీయూష్ చావ్లా ఒక్కడే.. ఒక్క వికెట్ సాధించాడు. మిగతా బౌలర్లంతా వికెట్లు తీయడంలో రాణించలేకపోయారు. దీంతో.. రాజస్థాన్ సూపర్ విక్టరీ సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్ లో తిలక్ వర్మ (65) అత్యధిక పరుగులు చేశాడు. నేహాల్ వధేరా (49) రన్స్ సాధించాడు.

ముంబై బ్యాటింగ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ (6), ఇషాన్ కిషన్ డకౌట్ తో నిరాశపరిచారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (10) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత తిలక్ వర్మ (65), నబీ (23), నేహాల్ వధేరా (49), హార్ధిక్ పాండ్యా (10), టిమ్ డేవిడ్ (3) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లతో చెలరేగాడు. అతని 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్ 2.. చాహల్, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు.

Tags

Read MoreRead Less
Next Story