Team India: లంకలో అడుగుపెట్టిన టీమిండియా

Team India: లంకలో అడుగుపెట్టిన టీమిండియా
ఆసియా కప్‌లో తొలి పోరుకు సిద్ధమవుతున్న రోహిత్‌ సేన... సెప్టెంబర్‌ 2న భారత్‌-పాక్‌ మధ్య హై ఓల్టేజ్‌ మ్యాచ్‌...

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసియా కప్‌ -2023 ప్రారంభమైంది. ఆసియా కప్‌ (Asia Cup 2023) కోసం భారత జట్టు (Team India) శ్రీలంకలో అడుగుపెట్టింది. కొలొంబో ఎయిర్‌పోర్టుకు వచ్చిన టీమ్‌ఇండియా ఆటగాళ్ల(Team India arrives)కు ఘన స్వాగతం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, షమీతోపాటు ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఈ ఏడాది ఆసియాకప్‌ శ్రీలంక, పాకిస్థాన్‌ వేదికగా హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తున్నాయి. భారత్‌ ఆడే మ్యాచ్‌లకు శ్రీలంక వేదిక కానుంది.


ఆసియాకప్‌లో భారత్‌-పాకిస్తాన్‌( rivals Pakistan) ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్లు సెప్టెంబర్‌ 2(September 2 )న కొలంబో వేదికగా తలపడనున్నాయి. ఆ తర్వాత సూపర్‌-4 దశలోనూ ఇరుజట్లు పోటీపడే అవకాశం ఉంది. ఈ రెండు జట్లూ ఫైనల్‌కు చేరితే అక్కడ కూడా మనం దాయాదుల పోరు వీక్షించవచ్చు. మొత్తంగా ఆసియాకప్‌లో అన్ని అనుకూలిస్తే భారత్‌-పాకిస్తాన్‌ మధ్య మూడు వన్డేలను చూడవచ్చు.

అంతర్జాతీయ క్రికెట్‌లో దాయాదులు భారత్‌-పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే క్రీడాభిమానుల్లో ఎంతో క్రేజ్‌. ఇరుదేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాల వల్ల రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లోనో లేదా ఆసియాకప్‌ వంటి టోర్నీల్లోనో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ చూసే భాగ్యం క్రీడాభిమానులకు దక్కుతోంది. తాజాగా మూడునెలల వ్యవధిలో ఆసియాకప్‌, ప్రపంచకప్‌ వంటి టోర్నీల్లో పలుమార్లు దాయాదుల పోరు వీక్షించే భాగ్యం అభిమానులకు కలగనుంది.


రోహిత్‌ శర్మ సారథ్యంలో భారత్‌, బాబర్‌ అజామ్‌ నేతృత్వంలోని పాక్‌ మధ్య ఈ శనివారం జరిగే ఆసియాకప్‌ పోరు కోసం రెండు దేశాల అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ జట్లు ఇప్పటివరకు 13 సార్లు తలపడగా.. ఏడు సార్లు భారత్‌, అయిదు సార్లు పాక్‌ గెలిచాయి. 2018లో తలపడ్డ రెండుసార్లూ టీమ్‌ఇండియానే పైచేయి సాధించింది. పాక్‌తో గత అయిదు ఆసియాకప్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ నాలుగు సార్లు నెగ్గడం విశేషం.

ఆసియా కప్‌ తర్వాత అక్టోబర్‌-నవంబర్‌లో భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. అందుకే జట్టు బలాబలాలను పరీక్షించుకునేందుకు ఈ టోర్నీని వినియోగించుకోవాలని అన్నీ జట్లు ఆశిస్తున్నాయి. వన్డే ఫార్మాట్‌లో జరుగనున్న ఈ టోర్నీ ద్వారా కూర్పును పరీక్షించుకోవాలని టీమ్‌ఇండియా భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story