కరోనా వైరస్‌పై ఫైజర్‌ టీకా 90శాతం విజయం సాధించింది : ఫైజర్‌ బయో ఎన్‌టెక్‌

కరోనా వైరస్‌పై ఫైజర్‌ టీకా 90శాతం విజయం సాధించింది : ఫైజర్‌ బయో ఎన్‌టెక్‌

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనే సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఫ్రదానంగా వాక్సిన్‌ కనుగొనే పనిలో పడ్డాయి. అయితే... తమ టీకా 90శాతం విజయం సాధించిందని ఫైజర్‌-బయో ఎన్‌టెక్‌ ప్రకటన చేయడంతో ప్రపంచం కాస్త ఊపిరిపీల్చుకుంది. కానీ ఈ వ్యాక్సిన్‌ ప్రయోగాల్లోనూ కొన్ని దుష్ప్రభావాలను గుర్తించినట్లు తాజాగా తెలిసింది. ఏవైనా టీకాలు వేసుకున్నప్పుడు కొంచెం జ్వరం, నొప్పి రావడం సాధారణమే. అయితే ఫైజర్‌ టీకా వేసుకున్న తర్వాత నొప్పితో పాటు తలనొప్పి, తీవ్రమైన హ్యాంగోవర్‌గా అనిపించిందని వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లు చెప్పినట్లు కొన్ని ది ఇండిపెండెంట్‌ పత్రిక పేర్కొంది.

ఆరు దేశాలకు చెందిన దాదాపు 43వేల మందికి పైగా వాలంటీర్లపై ఫైజర్‌-బయోఎన్‌టెక్‌లు టీకా మూడు దశల ప్రయోగాలు చేప్టటారు. టీకా తీసుకున్న తర్వాత తలనొప్పి, కండరాల నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కన్పించినట్లు చాలా మంది వాలంటీర్లు చెప్పారు. తొలి డోస్‌లో సైడ్‌ఎఫెక్ట్స్‌ తక్కువగా కన్పించినప్పటికీ రెండో డోస్‌ తీసుకున్న తర్వాత ఈ లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని 45ఏళ్ల వాలంటీర్‌ ఒకరు చెప్పారు. వ్యాక్సిస్‌ వేసుకున్న తర్వాత తనకు తీవ్రమైన హ్యాంగోవర్‌ వచ్చినట్లు అన్పించిందని టెక్సాస్‌కు చెందిన వాలంటీర్‌ ఒకరు తెలిపారు. అయితే కొద్దిసేపటి తర్వాత సాధారణ స్థితికి వచ్చానన్నారు.

కరోనా వైరస్‌పై ఫైజర్‌ టీకా ప్రభావవంతంగా పనిచేస్తోందని ఆ కంపెనీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆల్బర్ట్‌ గత సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. 'వైద్యశాస్త్రంలో ఇదో గొప్ప రోజు. కొవిడ్‌ను కట్టడి చేసే సామర్థ్యం మా వ్యాక్సిన్‌కు ఉందని మా మూడు దశల ప్రయోగాల ద్వారా నిరూపితమైంది' అని ఆల్బర్ట్‌ ఆనందం వ్యక్తం చేశారు. సాధారణంగా వ్యాక్సిన్‌ విడుదలకు ముందు నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం లభించాలంటే.. తుది దశ ప్రయోగాల అనంతరం వాలంటీర్లకు సంబంధించి రెండు నెలల పూర్తి విశ్లేషణ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫైజర్‌ ఈ సమాచారాన్ని సేకరించే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో వాలంటీర్లు సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి వెల్లడిస్తున్నారు.

మరోవైపు..కరోనా వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇందులోభాగంగా ఇప్పటికే ఆస్ట్రాజెనెకా తయారుచేసిన 'కోవిషీల్డ్‌' వ్యాక్సిన్‌ 4కోట్ల డోసులను తయారుచేసి సిద్ధంగా ఉంచినట్లు భారత్‌కు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ప్రకటించింది. అయితే, ప్రస్తుతం తయారుచేసిన 4కోట్ల వ్యాక్సిన్‌ డోసులు భారత్‌లో సరఫరా చేయడానికేనా? అన్న ప్రశ్నకు మాత్రం సీరం ప్రతినిధులు సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం, ఈ టీకా తుది ప్రయోగాలను సీరంతో పాటు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కలిసి నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 15చోట్ల ప్రయోగాలను కొనసాగిస్తున్నాయి. ఇక మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం 1600 వాలంటీర్ల నమోదు ప్రక్రియను ఈమధ్యే పూర్తిచేసినట్లు సీరం ఇనిస్టిట్యూట్ తెలిపింది. మరోసంస్థ నోవావాక్స్‌ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌ డోసుల తయారీని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ఈ సంస్థ‌ వెల్లడించింది. ఈ‌ వ్యాక్సిన్‌ మాత్రం తుది దశ ప్రయోగాల అనుమతి కోసం ఎదురుచూస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story