Telangana BJP: విజయసంకల్ప యాత్ర బీజేపీ సిద్ధం

Telangana BJP: విజయసంకల్ప యాత్ర  బీజేపీ సిద్ధం
ఈనెల 20 నుంచి 29 వరకు

రాష్ట్రంలోని అత్యధిక పార్లమెంట్‌ స్థానాలను కైసవం చేసుకోవడమే లక్ష్యంగా ఈనెల 20 నుంచి 29 వరకు విజయ సంకల్ప యాత్రలు నిర్వహించేందుకు...రాష్ట్ర భాజపా సిద్దమైంది. ఈమేరకు 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలను ఐదుక్లస్టర్స్‌గా విభజించింది. ఐతే రెండు పెద్దగా ఉండటంతో నిర్దేశిత సమయానికి పూర్తి కాకపోవచ్చని.... ఆ రెండు క్లస్టర్స్‌లో మార్చి 3వరకి యాత్ర కొనసాగే అవకాశముందని తెలుస్తోంది. అన్ని యాత్రలు చివరకు హైదరాబాద్‌కి చేరుకునేలా రూట్ మ్యాప్‌ని రాష్ట్రనాయకత్వం సిద్ధం చేసింది. అనివార్య కారణాలతో అన్ని యాత్రలు ఒకే రోజు ముగింపు కుదరకుంటే ఇబ్బంది తలెత్తే అవకాశమున్న నేపథ్యంలో బహిరంగసభను మార్చి 4న జరపాలనిపార్టీ భావిస్తోంది. పరేడ్‌గ్రౌండ్ వేదికగా నిర్వహిస్తే బాగుంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ బహిరంగ సభకు ప్రధాని మోదీని రాష్ట్రనాయకత్వం ఆహ్వానించింది. రథయాత్రల ముగింపు సభతోపాటు పార్లమెంట్ ఎన్నికలకు మోడీ ఆ సభతో సమరశంఖం పూరించనున్నట్లు తెలుస్తోంది.


ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లను కలిపి క్లస్టర్‌గా విభజించిన భాజపా దానికి కొమురం భీంయాత్రగా పేరుపెట్టింది. 800 కిలోమీటర్ల మేరఆ యాత్ర కొనసాగనుంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ పార్లమెంట్‌ స్థానాల్ని క్లస్టర్‌గా విభజించిన కమలదళం దానికి కృష్ణమ్మ యాత్రగా నామకరణం చేసింది. 926 కిలోమీటర్ల మేర.... ఆ యాత్ర చేపట్టనున్నారు. కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్‌ స్థానాలకు శాతవాహన యాత్రగా పేర్కొంది. వెయ్యి12 కిలోమీటర్ల మేర ఆ యాత్ర కొనసాగనుంది. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్‌ స్థానాన్ని క్లస్టర్‌గా విభజించిన భాజపా కాకతీయ యాత్రగా పేరుపెట్టారు. సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర యాత్రచేపట్టనున్నారు. భువనగిరి,సికింద్రాబాద్, హైదారాబాద్, మల్కాజ్‌గిరిని ఒక క్లస్టర్‌గా విభజించిన పార్టీ దానికి ‘భాగ్యనగర్ యాత్రగా నిర్ణయించారు. 500 కిలోమీటర్ల మేర యాత్ర జరగనుంది. ఆ యాత్రలో ప్రతిరోజూ రెండు లేదా మూడు అసెంబ్లీ స్థానాలు చుట్టేలా ప్రణాళికలు రచించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగే ఆ 5యాత్రల్లో రాష్ట్రస్థాయి నేతలు ఒక్కోచోట రెండ్రోజులు పాల్గొనే అవకాశముంది. కేంద్రమంత్రులు, జాతీయస్థాయి నేతలు సైతం వచ్చే అవకాశముంది.

నెలాఖరున ఏదైనా ఓ యాత్రలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పాల్గొనే అవకాశముందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అప్పుడే పార్లమెంట్ ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశముందని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story