BJP: బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌-మజ్లిస్‌ డీఎన్‌ఏ ఒక్కటే

BJP: బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌-మజ్లిస్‌ డీఎన్‌ఏ ఒక్కటే
డబ్బులతో ప్రజలను కొనాలని చూస్తున్నారు... కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీల DNA ఒక్కటేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు డబ్బులతో ప్రజల్ని కొనాలని చూస్తున్నాయని మోసపోతే నష్టపోతామని సూచించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులకు సీఎం కేసీఆర్‌ డబ్బులు పంపిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌కు మద్దతుగా గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. KCRకు ఓటేస్తే ఆయన పిల్లలకు దోచిపెడుతారని బీజేపీకు ఓటేస్తే ప్రజల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. మహేశ్వరంలో రెండు పడక గదుల ఇళ్లను మజ్లిస్‌ నేతల సూచనల మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానికేతరులకు కేటాయించారని.. అధికారంలోకి రాగానే తిరిగి గిరిజనులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ఒకే తాను ముక్కలని కిషన్‌రెడ్డి ఆరోపించారు.


కాంగ్రెస్ గెలవాలని ఆ పార్టీలోని 70 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి K.C.R డబ్బులు ఇస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీరామ్‌కు మద్దతుగా కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. KTRను సీఎం చేస్తే బీఆర్‌ఎస్‌లో పదవి కోసం నేతల మధ్య కొట్లాట తప్పదని కాంగ్రెస్‌లో ఐతే గల్లీ నుంచి దిల్లీ వరకు అందరూ ముఖ్యమంత్రులేనని విమర్శించారు. తాను ఎక్కడికెళ్లినా కరెంట్ కట్ చేస్తున్నారని.. మరో 15 రోజుల్లో కేసీఆర్ పవర్ కట్ కాబోతుందని సంజయ్‌ మండిపడ్డారు.


తాను పేదల కోసం కొట్లాడుతున్నానని కేసీఆర్ కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా కేంద్రం నిధులు తీసుకొస్తే కొబ్బరికాయలు కొట్టి ఫోజులు కొడుతున్న గంగులకు గుణపాఠం చెప్పాలన్నారు. కేంద్రం మంజూరు చేసిన రెండు లక్షలకు పైగా ఇండ్లు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలది భూ కబ్జాలు, అవినీతి లొల్లి అన్నారు . ఇంటి ముందు ఇసుక కుప్పలు కనిపిస్తే బీఆర్ఎస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఖాళీ జాగాలు కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్న గంగుల... కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. యువతక ఉద్యోగాల కోసం తాను కేసీఆర్ పై కొట్లాడి.. జైలుకు పోయానని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట ప్రజల్ని మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. కుంభస్థలాన్ని కొట్టేందుకే గజ్వేల్‌ బరిలో నిలిచినట్లు స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story