Telangana : అప్పులపై కేంద్ర ఆంక్షలపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి
Telangana : తెలంగాణకు అప్పుల విషయమై కేంద్రం అనుమతి ఇవ్వకపోవడాన్ని సీరియస్గా తీసుకున్నారు సీఎం కేసీఆర్. అవసరమైతే, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీ వెళ్లి పలు రాజకీయ పార్టీలతో మాట్లాడాలనే ఆలోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం విధిస్తున్న ఆంక్షలపై ఇకపై గట్టిగానే గళం విప్పాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. కేంద్ర ఆంక్షలపై వెంటనే అసెంబ్లీని సమావేశ పరిచి, కేంద్రం తీరుపై తీర్మానం చేయాలనే ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.
కేంద్ర ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేసినా, లేఖలు రాసినా స్పందించకపోవడంతో ఇవాళ నేరుగా ఢిల్లీ వెళ్తున్నారు తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు.. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులను కలవనున్నారు. అప్పులు లెక్కప్రకారమే తీసుకుంటున్నామని వివరించి, ఆంక్షలను ఎత్తివేయాలని కోరనున్నారు. కేంద్రం గనక అప్పులపై ఆంక్షలు ఇలాగే కొనసాగిస్తే.. రాష్ట్రంలో నడుస్తున్న అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని, సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బందులు తలెత్తవచ్చని వివరించనున్నారు.
ఇప్పటికే రాష్ట్రాల విధులలో కేంద్రం జోక్యంపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్రాలను నమ్మకుండా కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉందంటూ ఫైర్ అయ్యారు. రోజువారి కూలీల డబ్బులు కూడా నేరుగా కేంద్రమే వేయడం సరైన విధానం కాదన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com