బడ్జెట్ కూర్పుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీక్ష

బడ్జెట్ కూర్పుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీక్ష
ఈ బడ్జెట్ సాదా సీదా బడ్జెట్ గా ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు.

2021 -22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కూర్పు పై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటికే అన్ని శాఖలు బడ్జెట్ కూర్పు పై తమ నివేదికలు ఆర్థిక శాఖ కు అందజేసాయి. గత సంవత్సరం లక్షా 82వేల కోట్ల బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కానీ కరోనా తో దాదాపు50వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయింది ప్రభుత్వం. దీంతో బడ్జెట్ అంచనాలను మళ్ళీ సవరించి..వివిధ శాఖ ల బడ్జెట్ లో కోత విధించింది ప్రభుత్వం.

ఈ సంవత్సరం ఇప్పుడిపుడే ఆర్ధికంగా కోలుకుంటున్న రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్.. మరింత భారంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నివేధించిన ఏ ఒక్క అంశాన్ని పరిగణలోనికి తీసుపోకపోగా కేంద్రం నుంచి విధిగా రావాల్సిన నిధులలో కూడా కోత పెట్టింది. దీంతో బడ్జెట్ కూర్పు ఎలా చేయాలో తెలియక ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే బడ్జెట్ కూర్పు పైన జరిగిన సమీక్ష లో సీఎం కేసీఆర్ అనేక సూచనలు ఆర్దిక శాఖ అధికారులకు చేసినట్లు సమాచారం. గతంలో వివిధ శాఖలు బడ్జెట్ కోసం ఇచ్చిన అంచనాలు కాకుండా ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ని దృష్టిలో పెట్టుకొని మరోసారి అంచనాలు తీసుకోవాలని సూచించారట.

గతంలో వ్యవసాయం ,ఇరిగేషన్ రంగాలకు ఈ సారి బడ్జెట్ లో అంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. కేంద్ర బడ్జెట్ లాగే రాష్ట్ర బడ్జెట్ కూడా హెల్త్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆర్టీసీ నష్టాలలో ఉండడంతో ప్రభుత్వం సహాయం చేయాల్సి వస్తుంది. ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించుకునే ఆలోచన లో ఉందని సమాచారం. ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు మరికొన్ని మార్గాలు అన్వేషిస్తున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం,మధ్యం ధరల పెంపు తో పాటు, ఎల్ ఆర్ ఎస్ ను మళ్ళీ తెస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తుందట ప్రభుత్వం. ఇలా ఆదాయం సమకూరే మార్గాలను అన్వేషిస్తుంది ప్రభుత్వం.

అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే.. గత సంవత్సరం ప్రవేశ పెట్టిన లక్షా 82వేల కోట్ల బడ్జెట్ కు మించే అవకాశం లేదని..ఈ బడ్జెట్ సాదా సీదా బడ్జెట్ గా ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story