యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపై కేసీఆర్‌ రివ్యూ

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపై కేసీఆర్‌ రివ్యూ
త్వరలో ఆలయం పునఃప్రారంభించనున్ననేపథ్యంలో గడువులోగా తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని భారీ స్థాయిలో అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. త్వరలో ఆలయం పునఃప్రారంభించనున్న నేపథ్యంలో గడువు లోగా తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు తుది రూపు దాలుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆర్నమెంటల్ లుక్ కోసం కార్యాచరణ గురించి ఆలయ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు.

ఇటీవల యాదాద్రిలో పర్యటించి క్షేత్రస్థాయిలో దేవాలయ పరిసర ప్రాంతాలను కలియదిరిగి పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి.. పనుల పురోగతి ఎంతవరకు వచ్చిందనే విషయాలను తాజాగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్న క్యూలైన్ నిర్మాణంలో చేపట్టాల్సిన అలంకరణ గురించి పలు సూచనలు చేశారు. 350 అడుగుల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలన్నారు. క్యూలైన్ పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలను అధికారులు సీఎం ముందుంచారు. వీటిని పరిశీలించి నాలుగింటిలో ఒకదాన్ని ఫైనల్‌ చేశారు. ఉత్తర దిక్కున వున్న ప్రహరీ గోడను తొలగించి, అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 15 లోపు క్యూలైను నిర్మాణం పూర్తికావాలని సీఎం గడువు విధించారు.

ఇక దీప స్థంభాన్ని, ప్రహరీని ఇత్తడితో సృజనాత్మకంగా తీర్చిదిద్ది పెడస్టల్‌కు కూడా ఇత్తడితో ఆకృతులను బిగించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. శివాలయ నిర్మాణం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి.. ఆలయ ప్రహరీ గోడలకు ఇత్తడితో తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను బిగించాలన్నారు. ఉత్తర దిక్కు ప్రాకారాన్ని తొలగించి గుడి కనిపించే విధంగా గ్రిల్స్, రెయిలింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇతర కట్టడాలు అడ్డులేకుండా, దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు తిరిగి చూసినా సుందరంగా కనిపించే విధంగా తుదిమెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో సుదర్శనం చక్రం ఏర్పాటు చేసినట్టుగానే, శివాలయం చుట్టూ త్రిశూలం దర్శనమివ్వాలన్నారు. రథశాలను టెంపుల్ ఎలివేషన్‌తో తీర్చిదిద్దాలన్నారు. విష్ణు పుష్కరిణి కొండపై చుట్టూ నిర్మించే ప్రహరీ గోడలమీద రెండు వైపులా వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలను అలంకరించాలన్నారు సీఎం కేసీఆర్.

మరోవైపు 80 అడుగుల పొడవున్న దీప స్థంభాన్ని లాన్ మధ్యలో ఏర్పాటు చేయాలన్నారు. అద్దాల మండపం అత్యంత సుందరంగా నిర్మితమౌతుందని కేసీఆర్ కితాబిచ్చారు. చివరి అంకానికి చేరుకున్న ఆలయ నిర్మాణం పనులను.. మరింత వేగవంతం చేయాలన్నారు. రాత్రి వేళల్లో ఆలయ సముదాయాన్ని, ప్రాంగణాల చుట్టూ పరిసరాలను దివ్యమైన వెలుగులతో ప్రకాశించే విధంగా రూపొందించిన లైటింగ్ డెమో వీడియోను ముఖ్యమంత్రి తిలకించారు. పునర్నిర్మాణం అనంతరం ప్రపంచ దేవాలయాల్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం తన ప్రత్యేకతను చాటుకోబోతోందన్నారు కేసీఆర్. నూటికి నూరు శాతం రాతి కట్టడాలతో కృష్ణ శిలలతో నిర్మితమౌతున్న యాదాద్రి దేవాలయం అద్భుత రూపాన్ని సంతరించుకుందని తెలిపారు. పున: ప్రారంభం అనంతరం లక్ష్మీనారసింహుని దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని.. వారందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వుండే విధంగా గుట్ట పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అధికారులను అదేశించారు.


Tags

Read MoreRead Less
Next Story