CM KCR Tours : సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన..!
CM KCR Tours : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేయనున్నారు. ఇవాళ సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు వెళ్తున్నారు. నూతన కలెక్టరేట్ భవనాలతో పాటు అత్యాధునిక హంగులతో నిర్మించిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారి కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు. వీటిని 38 కోట్లతో తెలంగాణ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ నిర్మించింది. 21న వరంగల్, 22న భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.
ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. ఈనెల 21, 22 తేదీల్లో జిల్లాలో ఆయన పర్యటన ఉండనుంది. 21న యాదాద్రి ఆలయం, 22న సీఎం దత్తత గ్రామం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించనున్నారు. తుది దశకు చేరుకున్న యాదాద్రి ప్రధానాలయ పనులను పరిశీలించి తుది మెరుగుకు పలు సూచనలు చేయనున్నారు సీఎం. కొండపై ఆలయ పరిసరాల అభివృద్ధి, కొండ చుట్టూ రింగ్ రోడ్డుతో పాటు గండి చెరువు వద్ద భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన, పనుల పురోగతిని పరిశీలించనున్నారు. రోజంతా యాదాద్రి క్షేత్రంలోనే పర్యటించి.. కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహంలో రాత్రిబస చేసే అవకాశం ఉంది.
ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడానికి దత్తత తీసుకున్న తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ ఈనెల 22న పర్యటించనున్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులుకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి తన పర్యటన వివరాలను తెలిపారు. గ్రామంలో అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించుకుందామని చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com