REVANTH: సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

REVANTH: సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం.... ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిర్దేశం

వేసవిలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. వేసవిలో విద్యుత్, తాగునీటి సరఫరాపై అధికారులతో రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం పర్యవేక్షణ కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్దేశించిన రేవంత్‌.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో వాటర్ ట్యాంకర్లు అందుబాటులో ఉంచాలన్నారు. ట్యాంకర్లు బుక్ చేస్తే... 12 గంటల్లోపు చేరేలా చూడాలన్నారు. కోతలు లేకుండా కరెంటు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పెరిగిన డిమాండ్‌కు తగ్గట్లు వేసవిలో విద్యుత్ సరఫరాకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సన్నాహాలు చేయాలన్నారు.


మరోవైపు... లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో చేరికల జోష్ నెలకొంది. GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి. కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్ లోని సీఎం నివాసానికి వెళ్లిన ఆమె..పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ మేయర్ విజయలక్ష్మికి పార్టీ కండువా కప్పి, కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. సీనియర్ నేత కె. కేశవరావు కుమార్తె అయిన విజయలక్ష్మి బంజారాహిల్స్ కార్పొరేటర్ గా రెండుసార్లు గెలుపొందారు. 2021లో జరిగిన GHMC ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున రెండోసారి కార్పొరేటర్ గా గెలిచి మేయర్ గా ఎన్నికయ్యారు. ఆమె తండ్రి, బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ పక్షనేత కె. కేశవరావు కూడా.... పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. త్వరలో సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఇప్పటికే కేకే ప్రకటించారు.

బీఆర్‌ఎస్‌ నేతలు అయోమయంలో ఉన్నారని స్టేషన్ ఘన్ పూర్ MLA కడియం శ్రీహరి తెలిపారు. బీఆర్‌ఎస్‌ను వీడేందుకు సిద్ధమైన కడియం శ్రీహరి తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు.కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు కుమార్తె కావ్యతో కలిసి హైదరాబాద్‌లోని తన నివాసంలో అనుచరులతో కడియం సమావేశమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ బలహీన పడిందన్న కడియం బీఆర్‌ఎస్‌ నేతల నుంచి సహకారం లభించలేదని తెలిపారు. ఓడిపోయే పార్టీ నుంచి కావ్య పోటీ వద్దని అనుకున్నట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story