CM Revanth Reddy: ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక

CM Revanth Reddy: ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక
అటవీ, పర్యాటక శాఖలు సమన్వయంతో పని చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి

సచివాలయంలో అటవీ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి.. అటవీ, పర్యాటక శాఖలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా వైవిధ్య ప్రాంతాలను గుర్తించి.. రెండు విభాగాలు సంయుక్తంగా ప్రాజెక్టుల ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అటవీ అందాలు, వన్య ప్రాణులు, వలస వచ్చే విదేశీ పక్షులు, విభిన్న జీవ వైవిధ్యమున్న ప్రాంతాలు, హెరిటేజ్ ప్రదేశాలు, సంస్కృతికి అద్దం పట్టే వాటిని గుర్తించి అభివృద్ధి చేయాలని ఆదేశించారు. వన్య ప్రాణులకు హాని కలిగించకుండా ప్రత్యేక పర్యాటక విధానం రూపొందించాలని చెప్పారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా ప్రత్యేక కన్సెల్టెన్సీల ద్వారా ప్రతిపాదనలు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఐఎఫ్ఎస్ ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సీఎం చెప్పారు.

రాష్ట్రంలో అడవులతో ముడిపడి ఉన్న ప్రకృతి అందాలను, పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించేలా కృషి చేయాలని.. అవసరమైతే ప్రత్యేకంగా కన్సెల్టెన్సీలను నియమించి ప్రతిపాదనలు తయారు చేయించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉత్తర తెలంగాణలో కవ్వాల్, దక్షిణ తెలంగాణ వైపు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వన్య ప్రాణులకు హాని కలిగించకుండా ప్రత్యేక పర్యాటక విధానం తయారు చేయాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాల్లోనే పర్యాటకులు విడిది చేసేలా ఉన్న ప్రాజెక్టులను అధ్యయనం చేసి, అక్కడ అనుసరిస్తున్న రక్షణ, భద్రత చర్యలను రాష్ట్రంలోనూ అమలయ్యేలా చూడాలని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, అటవీ కన్జర్వేటర్ డోబ్రియాల్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాలుష్య నిబంధనలు, ప్రమాణాలను పాటించే పరిశ్రమలను ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఏడాది పర్యావరణ దినోత్సవం లాంటి సందర్భాన్ని పురస్కరించుకొని జీరో పొల్యూషన్ పాటించే సంస్థలకు ప్రశంసా పత్రాలను అందించాలని స్పష్టం చేశారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాలకు అందుబాటులో ఉండేలా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు, అనువైన ప్రాంతాలను పరిశీలించాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించి ప్లాస్టిక్ తయారు చేసే పరిశ్రమలకు నోటీసులు ఇచ్చి భారీగా జరిమానాలు విధించాలని చెప్పారు. రాష్ట్రానికి మంజూరైన 81 మంది ఐఎఫ్ఎస్ పోస్టుల్లో ప్రస్తుతం 55 మంది మాత్రమే ఉన్నారని, మిగతా 26 ఐఎఫ్ఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమావేశంలో చర్చ జరిగింది. ఖాళీలు లేకుండా సరిపడే సంఖ్యలో IFSలను కేటాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story