Telangana : రేవంత్ పాలన @ 100 రోజుల ప్రగతి నివేదన

Telangana  : రేవంత్ పాలన @ 100 రోజుల ప్రగతి నివేదన
ఆరుగ్యారంటీలపైనే ప్రభుత్వ దృష్టి

డిసెంబర్‌ ఏడున పాలనా పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వంద రోజుల ప్రగతి నివేదనను విడుదల చేసింది. డిసెంబరు 7న ప్రగతిభవన్ వద్ద కంచెను తొలగించి తమ ప్రభుత్వ నిర్వహణ తీరుపై సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రగతి భవన్ పేరును మహాత్మ జ్యోతిభా ఫూలే భవన్‌గా మార్చి.. అక్కడ ప్రజావాణి కార్యక్రమానికి సర్కార్‌ శ్రీకారం చుట్టింది. వారంలోరెండు రోజులు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.

వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరుగ్యారంటీలపైనే ప్రభుత్వం ఇన్నాళ్లూ ప్రధానంగా దృష్టి సారించింది. అభయ హస్తంలోని 13 కార్యక్రమాల్లో ఐదు పథకాలను వంద రోజుల్లో అమల్లోకి తెచ్చింది. ప్రజాపాలన పేరుతో గ్రామ, పట్టణ సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించింది. పగ్గాలు చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇప్పటి వరకు 25 కోట్ల మంది అతివలు ఈ పథకాన్ని వినియోగించుకున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది. ఆరోగ్య శ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకానికి శ్రీకారం చుట్టింది. సొంత స్థలం ఉన్న వారు ఇల్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించింది. మహిళలకు నెలకు 2 వేల 500 రూపాయలు, రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు, వరి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇచ్చే రైతుభరోసా కార్యక్రమం అమలు కావాల్సి ఉంది. ఇళ్లు లేని పేదలకు స్థలం, 5 లక్షల రూపాయలు, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు . కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సి ఉంది. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 29 వేల 384 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి.. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది. సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామకాలను కల్పించింది. TSPSC బోర్డును ప్రక్షాళన చేసి... ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డిని నియమించింది. గ్రూప్ వన్ పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి మరో 563 ఉద్యోగాలతో కొత్త ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11 వేల 62 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేష్ విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story