TS: తెలంగాణలో రాజకీయ మంటలు

TS: తెలంగాణలో రాజకీయ మంటలు
అధికార-ప్రతిపక్షాల మధ్య ప్రాజెక్టల రచ్చ... దక్షిణ తెలంగాణను కేసీఆర్‌ ఎడారిగా మార్చారన్న కాంగ్రెస్‌

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం అంశం... అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ మంటలు రేపుతోంది. చలో మేడిగడ్డ పేరుతో బీఅర్‌ఎస్‌ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించగా..... 'చలో పాలమూరు-రంగారెడ్డి' పేరుతో కాంగ్రెస్‌ నేతలు జలాశయాల పరిశీలనకు వెళ్లారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు చల్లా వంశీచంద్‌రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు... యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మధుసూధన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, పర్ణికారెడ్డి, వీర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో గల కరివేన జలాశయానికి చేరుకున్న కాంగ్రెస్‌ నేతలు...రిజర్వాయర్‌ పనులను పరిశీలించారు. జలాశయం నిర్మాణం పనులు, కొనసాగుతున్న తీరు, నిధులకు సంబంధించిన విషయాలను అధికారులనడిగి తెలుసుకున్నారు.


పదేళ్ల KCR పాలనలో కాళేశ్వరం పేరుతో ఉత్తర తెలంగాణను బొందలగడ్డ చేస్తే పాలమూరు-రంగారెడ్డి అంటూ దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చారని కాంగ్రెస్‌ ఆరోపించింది. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తిచేస్తానన్న కేసీఆర్‌ ఒక్క ఎకరానికైనా నీరిచ్చారా అని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల సందర్శనలో భాగంగా వివిధ జలాశయాల పనులను వారు పరిశీలించారు. బీఆర్‌ఎస్‌ నేతల తప్పుడు ప్రచారాలను ప్రజలకు వివరించేందుకే పర్యటన చేపట్టామన్న నేతలు అవినీతి, అక్రమాలను బయటికి తీస్తామన్నారు.


మూడేళ్లలో పాలమూరు-రంగారెడ్డిని పూర్తిచేస్తానన్న కేసీఆర్‌...ఎకరానికైనా నీరివ్వలేక పోయారని కాంగ్రెస్‌ నేత వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల్లో వాటా విషయంలోనూ గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ విఫలమైందన్న ఆయన... ఆంధ్రపాలకులు నీటిని తరలించుకుపోతుంటే వారికి సహకరించారని విమర్శించారు. ప్రాజెక్టుల్లో భారాస వైఫల్యాలను ఎండగట్టేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం... ఉద్దండాపూర్‌ జలాశయాన్ని కాంగ్రెస్‌ నేతలు పరిశీలించారు. 2015లో ప్రాజెక్టు ప్రారంభం కాగా... ఇప్పటికీ భూసేకరణ సైతం పూర్తికాలేదని, రైతులకు పరిహారాన్నీ అందించలేకపోయారని ఆరోపించారు. ధనార్జన కోసమే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఉపయోగించుకున్నారని... నిధుల అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా గత ప్రభుత్వం రెండో విడతలో చేపట్టాలని భావించిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ ప్రతిపాదిత ప్రాంతాన్ని కాంగ్రెస్‌ నేతలు పరిశీలించారు.

Tags

Read MoreRead Less
Next Story