తెలంగాణలో విద్యార్థులపై కరోనా పంజా

తెలంగాణలో విద్యార్థులపై కరోనా పంజా
గత కొన్ని రోజులుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కొవిడ్‌ బారినపడుతోన్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

తెలంగాణలో విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కొవిడ్‌ బారినపడుతోన్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని రెండు బాలికల పాఠశాలల్లో కలిపి 37 మందికి కరోనా సోకింది. వారిలో 32 మంది విద్యార్థినులు, ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో 200 మంది విద్యార్థినులు ఉన్నారు. అందులో 20 మంది గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో స్పందించిన పాఠశాల యాజమాన్యం వైద్య శిబిరం ఏర్పాటు చేసి కొవిడ్ పరీక్షలు చేయించారు. వారిలో 17 మంది బాలికలు, ఐదుగురు ఉపాధ్యాయులకు వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. వారిని వసతి గృహంలోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో 15 మంది విద్యార్థినులకు కరోన సోకింది. పాఠశాలలోని 6, 7, 8, 9 తరగతులకు చెందిన 62 మంది విద్యార్థినులకు కొవిడ్ టెస్టులు నిర్వహించారు. వారిలో 15 మంది బాలికలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి మోహనకృష్ణ తెలిపారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థినులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి ఐసోలేషన్‌లో ఉంచినట్లు చెప్పారు.

మెదక్‌ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయ ఈవో కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాద్‌కు వెళ్లి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈవో కరోనా బారిన పడటంతో భక్తుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏడుపాయల ఆలయాన్ని వారం రోజుల పాటు మూసి వేస్తున్నట్లు మెదక్‌ ఆర్డీవో వెల్లడించారు. అమ్మవారికి చేసే పూజలు, అభిషేకాలు తదితరాలు యధావిధిగా కొనసాగుతాయని, భక్తులకు మాత్రం ఆలయంలోకి ప్రవేశానికి అనుమతి లేదన్నారు. ఏడుపాయలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బందికి, పూజారులకు కరోనా పరీక్షల అనంతరం వచ్చే ఫలితాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కాగా రాష్ట్రంలో కొత్తగా 313 పాజిటివ్ కేసులు నమోదు కాదా.. ఇద్దరు మృతిచెందారు.

Tags

Read MoreRead Less
Next Story