ఈనెల 16 నుంచి తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌

ఈనెల 16 నుంచి తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌
ఈనెల 16 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ఈనెల 16 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్‌ వేసిన తర్వాత ఎవరికైనా రియాక్షన్‌ ఉంటే అవసరమైన వైద్య చికిత్స అందించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. మంత్రులు, కలెక్టర్లతో జరిగిన సమావేశంలో వ్యాక్సినేషన్‌పైనే ప్రధానంగా చర్చించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ కూడా పాల్గొన్నారు.. ఈ రెండు సందర్భాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.

సీరం రూపొందించిన కోవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌ సమర్థవంతమైన కోవిడ్‌ వ్యాక్సిన్లుగా ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. ఈ వ్యాక్సిన్లనే తెలంగాణలో అందించాలని నిర్ణయించినట్లుగా సీఎం కేసీఆర్‌ తెలిపారు. ముందుగా ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది సహా వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఆ తర్వాత ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ అందజేస్తామన్నారు. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి, ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్‌ అందించాలని నిర్ణయించామన్నారు. ప్రాధాన్యతా క్రమంలో నిర్ణయించిన వారిని వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు తీసుకొచ్చే బాధ్యతను గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. పోలీసులు, భద్రతా బలగాలకు వ్యాక్సిన్‌ అందించే బాధ్యతను పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ తీసుకోవాలన్నారు.

మరోవైపు కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా తెలంగాణకు 6 లక్షల 50వేల వ్యాక్సిన్లు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 42వేల 706 మంది ప్రభుత్వ హెల్త్‌కేర్‌ వర్కర్లు, లక్షా 46వేల 722 మంది ప్రైవేట్‌ హెల్త్‌కేర్‌ వర్కర్లు ఉన్నారు. వీరందరికీ తొలిదశలో వ్యాక్సిన్‌ అందించనున్నారు. అటు కరోనా వ్యాక్సిన్‌ హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్‌లోని కోఠి నుంచి దాదాపు 5 లక్షల సిరంజిలను ప్రత్యేక వాహనాల్లో జిల్లాలకు తరలిస్తున్నారు.

వ్యాక్సిన్‌ను అన్ని పీహెచ్‌సీల పరిధిలో ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వం చేసిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. వ్యాక్సిన్‌ను తరలించేందుకు 866 కోల్డ్‌ చైన్‌ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. అన్ని స్థాయిల్లో వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారని.. రాష్ట్ర స్థాయిలో సీఎస్‌ ఆధ్వర్యంలోని కమిటీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుందని చెప్పారు. జిల్లా, మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటయ్యాయన్నారు.

వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు భాగస్వామ్యం కావాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత ఎవరికైనా రియాక్షన్‌ ఉంటే వారికి వెంటనే వైద్య చికిత్స అందించేందుకు వీలుగా వ్యాక్సిన్‌ సెంటర్‌కు అనుబంధంగా ఒక గదిని, వైద్యులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని, అంబులెన్స్‌ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో కాల్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.. వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియలో కూడా కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story