ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తుంది : ముఖ్యమంత్రి కేసీఆర్‌

ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తుంది : ముఖ్యమంత్రి కేసీఆర్‌

వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ నిర్వహణ, ఇంకా మెరుగు పర్చాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెండు నెలల వ్యవధిలోనే లక్షా 6వేల మంది ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకుని, వారిలో 80 వేల మంది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారని సిఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు 5 ఎకరాల లోపు వారే ఉన్నారని, అలాంటి చిన్న రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములు రిజిస్టర్ చేయించకుని, మ్యుటేషన్ చేయించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని సిఎం చెప్పారు. వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న కొద్ది పాటి సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు రెండు నెలల వ్యవధిలో పరిష్కరిస్తారని సిఎం ప్రకటించారు. ధరణి పోర్టల్ లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత మెరుగు పరుస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అత్యంత పారదర్శంగా జరుగుతున్నాయని, పోర్టల్ లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత బలోపేతం చేయాలని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ రాకముందు రిజిస్ట్రేషన్ అయిన భూములను రిజిష్టర్డ్ డాక్యుమెంట్ల ఆధారంగా కొన్న వారి పేరిట జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్ చేయాలన్నారు. దీనికోసం మీ సేవ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తులు స్వీకరించి, స్లాట్లు కేటాయించాలని సూచించారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలని.. క్రమబద్దీకరించిన సాదాబైనామాల ప్రకారం భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలని.. పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కోర్టుల విచారణలో ఉన్నవి మినహా, భూ రికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా పార్ట్ – బి లో పెట్టిన వ్యవసాయ భూములకు సంబంధించిన అంశాలన్నింటినీ కలెక్టర్లు 60 రోజుల్లో పరిష్కరించాలన్నారు. అవసరమైన సందర్భాల్లో కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవాలని.. యాజమాన్య హక్కులను ఖరారు చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story