Editorial: " గవర్నర్, కేసీఆర్ ల మధ్య రాజీ ఎలా కుదిరింది?"

Editorial:  గవర్నర్, కేసీఆర్ ల మధ్య రాజీ ఎలా కుదిరింది?
తీవ్ర ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ; ఎలాంటి చర్చకు తావివ్వని గవర్నర్ ప్రసంగం; ఊహాగానాలన్నింటికి తమిళిసై చెక్; ఫలించిన ప్రభుత్వ మంత్రాంగం; భవిష్యత్తులోనూ ఇదే వాతావరణం ఉంటుందా?

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగం ఎటువంటి చర్చకు తావులేకుండా చేసింది. అసలు గవర్నర్ స్పీచ్ లేకుండానే సమావేశాల నోటిఫికేషన్ ఇవ్వడంతో హైడ్రామా చోటుచేసుకుంది. సమయం దగ్గరపడుతున్నా.. బడ్జెట్ ప్రతిపాదనలకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో.. కోర్టుకు వెళ్లడం.. అక్కడ ఇరు పక్షాల మధ్య రాజీకుదురడంతో సమస్య కొలిక్కివచ్చింది. అయితే గవర్నర్ ప్రసంగం ఎలా ఉంటుంది. స్పీచ్ లో రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేస్తే.. చదువుతుందా లేదా అనేది చర్చనీయాంశమైంది. తీరా ప్రసంగం చూస్తే.. రాజ్యాంగ పరిధికి లోబడి ఇరు పక్షాలు వ్యవహరించినట్టుగా కనిపిస్తోంది. ప్రగతిభవన్, రాజ్ భవన్ మధ్య సయోధ్య కుదరడంతో ప్రసంగంలోనూ కేంద్రంపై విమర్శలు లేకుండా ప్రభుత్వం స్పీచ్ కాపీ రెడీ చేసింది. గవర్నర్ సైతం క్యాబినెట్ ఆమోదం తెలిపిన స్పీచ్ ను చదవడంతో ఆశ్యర్యపోవడం ప్రతిపక్షాల వంతయింది.



రెండేళ్లుగా గవర్నర్, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య మాటలు లేవు. మంత్రులు ఎవరూ రాజభవన్ కు సైతం వెళ్లడం మానేశారు. ఏ కార్యక్రమం జరిగినా.. సీఎస్, డీజీపీ తప్ప.. ఎవరూ వెళ్లకపోవడంతో తనను ప్రభుత్వం అవమానపరుస్తోందని దిల్లీలో తొలిసారి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు తమిళిసై. మంత్రులు సైతం గవర్నర్ బీజేపీ ఏజెంట్ గా వ్యవహరిస్తోందంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆగస్టు పదిహేను ఏట్ హోం కార్యక్రమాన్ని సైతం బహిష్కరించారు. మొన్నటికి మొన్న రిపబ్లిక్ డే వేడుకలు రాజ్ భవన్ లోనే నిర్వహించారు. ఎట్ హోం కార్యక్రమానికి బీజేపీ నేతలు తప్ప ఎవరూ హాజరుకాలేదు. అసెంబ్లీ లో పాస్ అయిన బిల్లులకు ఆమోదం తెలుపకుండా.. గవర్నర్ పెండింగ్ లో పెట్టడంతో ఇరువురి మధ్య గ్యాప్ పెరిగింది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ నియామకం విషయంలో మొదలైన వివాదం.. అసెంబ్లీ బిల్లుల పెండింగ్ వరకు కొనసాగుతూవచ్చింది. ఇక గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రశంసించడంతోపాటు.. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన దక్షత వల్లే రాష్ట్రం అపూర్వ విజయాలను సాధించడంతో పాటు దేశానికి రోల్ మోడల్ అయిందంటూ ప్రశంసించారు.

మై గవర్నమెంట్ అంటూ ప్రభుత్వంపై ప్రశంసలు:

ఒక రకంగా కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితం.. సచివాలయ బిల్డింగ్ లు కాదు పేదలకు ఇళ్లు నిర్మించాలంటూ వ్యాఖ్యలు చేసిన గవర్నర్.. అసెంబ్లీలో చేసిన ప్రసంగంతో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాపీగా ఫీలయిందనె చెప్పవచ్చు. ఇన్నిరోజులు విమర్శలు చేసిన గవర్నర్.. స్పీచ్ వరకు వచ్చేసరికి రాజ్యాంగబద్ధంగా మై గవర్నమెంట్ అంటూ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించింది. ఇప్పటివరకు ప్రభుత్వంపై విరుచుకుపడ్డ గవర్నర్... అసెంబ్లీలో ప్రసంగంతోపాటు కార్యక్రమం సాఫీగా సాగడంతో అధికారయంత్రాగం సైతం ఊపిరిపీల్చుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ను గట్టిగా విమర్శించలేని పరిస్థితి. గవర్నర్ అసెంబ్లీ బయట పులి.. లోపల పిల్లిలా మారిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

మొత్తానికి తమిళనాడు అసెంబ్లీ తరహాలో పరిస్థితులు ఉంటాయనుకున్న వారందరికి గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఊహాగానాలన్నింటికి చెక్ పెట్టారు. మరి భవిష్యత్తులోనూ గవర్నర్, సీఎం మధ్య ఇదే వాతావరణం కొనసాగుతుందా లేదా వేచిచూడాలి. తమిళనాడులో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలనే తన ఆకాంక్షను తమిళిసై కేంద్రంలోని పెద్దల వద్ద వ్యక్తిపరిచందని.. దీంతో త్వరలోనే కొత్త గవర్నర్ తెలంగాణకు నియమిస్తారనే టాక్ సైతం వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story