ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020-2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలకు విధాన ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు కొత్త విధానంపై ఐటీ, ఎలక్ర్టానిక్స్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శుక్రవారం ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని మంత్రి కేటీఆర్ ప్రకటించనున్నారు.
రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్ హబ్గా మార్చే ప్రణాళికలో భాగంగా ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎలక్ర్టిక్ వాహనాల తయారీ వినియోగానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. ఈ వాహనాలను రాష్ట్రంలోనే కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకుంటే.. రాయితీలు కల్పించనుంది.
తొలి 2 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు, మొదటి 20 వేల.. మూడు చక్రాల ఆటోలకు, 5 వేల.. నాలుగు చక్రాల వాహనాలకు, 10 వేల.. లైట్ గూడ్స్ వాహనాలకు, 5 వేల ఎలక్ట్రిక్ కార్లకు, అలాగే 500 ఎలక్ట్రిక్ బస్సులకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ రుసుం మినహాయింపు ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు కూడా రోడ్ ట్యాక్స్, రిజిస్ర్టేషన్ ఫీజు పూర్తిగా మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజా రవాణా వ్యవస్థలోనూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుంది. ప్రజా రవాణా వాహనాలకు ఛార్జింగ్ సదుపాయాల కోసం తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com