TS: కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు

TS: కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
పండుగ వేళ సొంతూళ్లకు ప్రయాణికులు..... ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న టీఎస్‌ఆర్టీసీ

తెలంగాణలో సంక్రాంతి పండుగ సందర్బంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో అందుకు అనుగుణంగా అధికారులు సర్వీసులు నడిపిస్తున్నారు. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఒక్కసారిగా ప్రజలు రొడ్డెక్కడంతో రహదారులు రద్దీగా మారిపోయి. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 120కి పైగా ప్రత్యేక రైళ్ళను నడిపిస్తోంది.


వీటితో పాటు సాధారణ రైళ్లు సుమారు 400 వరకు నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. ప్రయాణికులు వాళ్ల రైలు వచ్చే సమయం కన్నా మూడు గంటలకు ముందే స్టేషన్లకు చేరుకుంటున్నారు. దీంతో రద్దీ భారీగా పెరిపోతుంది. విజయవాడ, విశాఖపట్టణం, రాజమండ్రి, కాకినాడ వైపుకు వెళ్లే రైళ్లు రద్దీగా కనిపించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణికులతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బిహార్ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు సైతం సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు.


ప్రయాణికుల రద్దీ దృష్ట్యా TSRTC 4,484 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించింది. మహాలక్ష్మి -ఉచిత రవాణా సౌకర్యం అమలు చేయడంతో మహిళా ప్రయాణికులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు R.T.C అధికారులు అంచనావేస్తున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా TSRTC ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన M.G.B.S, J.B.S, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, K.P.H.B, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story