జీహెచ్ఎంసి : పార్టీలవారీగా నామినేషన్ల వివరాలు
జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ పత్రాల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో... జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాల వద్ద నామినేషన్ల కోలాహలం కనిపించింది. చివరి రోజు అత్యధికంగా 1412 మంది అభ్యర్థులు... 1937 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 1932 మంది అభ్యర్థులు.. 2 వేల 602 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.
టీఆర్ఎస్ నుంచి 557 నామినేషన్లు దాఖలు కాగా.. బీజేపీ నుంచి 571, కాంగ్రెస్ నుంచి 372, టీడీపీ నుంచి 206 నామినేషన్లు దాఖలయ్యాయి. మజ్లిస్ నుంచి 78, సీపీఎం నుంచి 22, సీపీఐ నుంచి 21 నామినేషన్లు దాఖలయ్యాయి. రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుంచి 115 నామినేషన్లు వచ్చాయి. ఈసారి 650 మంది ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు అవకాశం కల్పించారు.
2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు సాధించి సత్తా చాటిన అధికార టీఆర్ఎస్.. తాజా ఎన్నికల్లోనూ 100కు పైగా స్థానాలపై గురిపెట్టింది. మొత్తం 150 స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ.. కారు పార్టీకి షాకిచ్చింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ మరింత శ్రద్ధ తీసుకుంది. 26 మంది సిట్టింగ్లను పోటీ నుంచి తప్పించింది. ఇక బీజేపీ 129 మంది అభ్యర్థులను ప్రకటించింది. అటు... 18 డివిజన్లలో నామినేషన్లు దాఖలు చేసిన జనసేవ... పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్లోని నాదెండ్ల మనోహర్ నివాసంలో పవన్కల్యాణ్, నాదెండ్ల మనోహర్తో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ సమావేశమయ్యారు. అనంతరం.. జనసేన పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీజేపీకి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.
అటు.. నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో... అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేయనున్నారు. ఇవాళ్టి నుంచి ర్యాలీలు, రోడ్షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పార్టీల ముఖ్యనేతలు బస్తీ పర్యటనలకు సిద్దమవుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com