సంజయ్ సర్జికల్ స్ట్రైక్‌ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్

సంజయ్ సర్జికల్ స్ట్రైక్‌ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూసుకుపోతున్నాయి. వాడివేడి మాటలతో ప్రజల్లో జోష్ పెంచుతున్నాయి. ఇక బీజేపీ నేతలు టీఆర్ఎస్, ఎంఐఎంపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గ్రేటర్ లో బీజేపీ గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలోని పాకిస్థానీయులు, రోహింగ్యాల్ని తరిమికొడతామని హెచ్చరించారు.

సంజయ్‌ చేసిన సర్జికల్‌ స్ట్రైక్‌ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ నేతలు ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ఏమైనా పాకిస్తాన్ లో ఉందా? సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చేస్తారని ఆగ్రహించారు. దేశంలోని పేదరికం, నిరుద్యోగం మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలని కేటీఆర్ సూచించారు.

ఇటు సంజయ్ సర్జికల్ స్ట్రైక్‌ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. పాతబస్తీలో ఉన్న ముస్లింలదంరూ భారతీయులేనని.. అలాంటి భారతీయులపై సర్జికల్ స్ట్రైక్‌ చేస్తారా అని ప్రశ్నించారు. ఆ సర్జికల్ స్ట్రైక్ ఏదో లద్దాఖ్ లో భారత భూభాగాన్ని ఆక్రమిస్తున్న చైనాపై చేయాలని అసదుద్దీన్ సవాల్ విసిరారు. మొత్తానికి బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలు గ్రేటర్ ఎన్నికల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story