ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్.. ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం

ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్.. ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటింగ్ వేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈసారి పోలింగ్ అత్యంత మందకొడిగా సాగింది. గ్రేటర్‌ పరిధిలో మొత్తం 74 లక్షల మంది ఓటర్లు ఉండగా.. కేవలం 30 లక్షల లోపే ఓట్లు పోలైనట్లు అంచనా వేస్తున్నారు. అంటే పోలింగ్ 40 శాతం లోపే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇది గతంతో జరిగిన పోలింగ్‌తో చూస్తే తక్కువే. 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో 45.29 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి అది కూడా సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.. సాయంత్రం 4 గంటల వరకు ఈసీ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం కేవలం 29.76 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది...చివరి రెండు గంటల్లో గరిష్టంగా 10 శాతం ఓట్లు పోలయ్యే ఛాన్స్ ఉంది . ఆ రకంగా చూసినా పోలింగ్ 40 శాతం కూడా దాటే అవకాశం కనిపించడం లేదు.. పోలింగ్ శాతం తగ్గడంతో పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఓటరు తీర్పు ఎలా ఉండబోతోంది అనే దానిపై లెక్కలు వెసుకుంటున్నారు. తగ్గిన పోలింగ్ శాతం ఎవరికి లాభిస్తుందనే దాన్ని ఒక్కోపార్టీ ఒక్కోరకంగాగా విశ్లేషిస్తోంది...

ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం అత్యధికంగా బాగ్ అంబర్ పేట్ లో 64.82 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత శివారు ప్రాంతాలైన భారతినగర్, పటాన్‌చెరు, ఆర్సీపురంలో పోలింగ్ 50 శాతం దాటింది..ఇక దత్తాత్రేయ నగర్‌ , హస్తినాపురం, గుడి మల్కాపూర్‌, అల్వాల్‌ , జగద్గిరి గుట్ట , అల్లాపూర్‌ ,మూసాపేట్‌ , గాజుల రామారం , చిల్కానగర్‌ లో ఓటింగ్ 40 శాతం నమోదైంది.. ఇక కంచన్‌ బాగ్‌ , షాలిబండ , డబీర్‌పుర, మూసారాం బాగ్‌ , ఐఎస్‌ సదన్‌ , కుర్మగూడ ,రెయిన్ బజార్‌ , తలాబ్‌ చంచలం, అమీర్‌పేట , సోమాజీగూడ వంటి ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది.

ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్ నిర్వహించనున్నారు. బ్యాలెట్‌లో సీపీఐ పార్టీ గుర్తు తారుమారైంది. సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తును ముద్రించారు. కంకి కొడవలికి బదులు.. కొడవలి సుత్తె గుర్తును ముద్రించారు. దీంతో సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. ఎన్నిక ఆపివేయాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నిక సంఘం నిర్ణయించింది. మొత్తం 69 పోలింగ్‌ కేంద్రాల్లో ౩న రీ పోలింగ్‌ నిర్వహించనున్నారు. రీ పోలింగ్ దృష్ట్యా ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధించింది ఎస్‌ఈసీ.

గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. పలు డివిజన్లలో చిన్నచిన్న గొడవలు మినహా మొత్తంగా ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. పలు చోట్ల తలెత్తిన ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీశాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పలు డివిజన్లలో వాగ్వాదం జరిగింది. పాతబస్తిలో పలుచోట్ల MIM రిగ్గింగుకు పాల్పడుతోందని బీజేపీ ఆందోళనకు దిగింది. అటు ఉప్పల్‌లో టీఆర్ఎస్-బీజేపీ నేతలు ఆందోళనతో చాలాసేపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. KPHBలో మంత్రి పువ్వాడ కాన్వాయ్‌ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు..

గ్రేటర్‌ పరిధిలో ఓటింగ్‌ జరిగిన తీరుపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఓట్లు వేసేందుకు యువత ఇళ్లు దాటి బయటకు రాలేదు.. వరుస సెలవులు రావడంతో ప్రైవేటు ఉద్యోగులు ఊళ్లకు వెళ్లిపోయారు.. సిటీ మధ్యలో ఉన్న డివిజన్లలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.. అతి తక్కు పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది.. కొన్ని చోట్ల కష్టనష్టాలకు ఓర్చి వయో వృద్ధులు,

వికలాంగులు ఓటు వేశారు.. కానీ యువకులు, టెకీలు మాత్రం సెలవులు ఎంజాయ్ చేశారు. .చాలా చోట్ల పోలింగ్ బూత్‌లు ఖాళీగా కనిపించాయి. దీంతో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు లేక సిబ్బంది నిద్రపోయే పరిస్థితి ఏర్పడింది.సిటీవాసుల బాధ్యతా రాహిత్యంపై ప్రజాస్వామ్యవాదుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఓటు వేయని వారికి సమస్యలపై ప్రశ్నించే హక్కు ఎక్కడిదని నిలదీస్తున్నారు..నీతులు చెప్పడంలో ముందుండే వారికి ఓటు వేసే బాధ్యత లేదా నిలదిస్తున్నారు.. ఓటు వేయనికి వారికి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలేవీ అందకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు...

GHMC పరిధిలో గతంలో ఎన్నికలు జరిగిన సందర్భంలోనూ ఇదే పరిస్థితి. 2014లో జీహెచ్‌ఎంసీ పరిధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 53 శాతమే ఓటింగ్‌ నమోదైంది.. 2018లో గ్రేటర్‌ పరిధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 50.86 శాతమే ఓటింగ్‌ నమోదైంది. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ హైదరాబాద్‌ సెగ్మెంట్‌లో 44.75 శాతమే ఓట్లు పోలయ్యాయి.. ఈసారి కూడా జనం పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకపోవంతో మరోసారి తక్కువ పోలింగ్ శాతమే నమోదైంది.

Tags

Read MoreRead Less
Next Story