Nizam Sugars: నిజాం షుగర్స్​పై కదలిక ..

Nizam Sugars: నిజాం షుగర్స్​పై కదలిక ..
కార్మికుల్లో చిగురిస్తున్న ఆశలు

ఏన్నో ఏళ్లుగా మూసివేసి ఉన్న నిజాం షుగర్స్ చక్కెర కర్మాగారం పునరుద్ధరించే దిశగా.. ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. చక్కెర పరిశ్రమ తెరుచుకుంటుందనడంతో.. రైతులు, కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తిరిగి పరిశ్రమ తెరుచుకుంటే బోధన్ ప్రాంతం పూర్వవైభవం సంతరించుకోవడంతో పాటు.. ప్రత్యేక్షంగా పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది.

మూతపడిన నిజాం చక్కెర పరిశ్రమను తెరిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నం సాగిస్తుంది. కర్మాగారం తిరిగి తెరిపించేందుకు అవసరమైన సిఫార్సుల కోసం.. ప్రజాప్రతినిధులు, అధికారులతో కమిటీ వేసింది. ఈ అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది. రెండు నెలల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ప్రధాన కర్మాగారంతోపాటు.. జగిత్యాల జిల్లా ముత్యంపేట, మెదక్ జిల్లా మొంబోజీపేట్‌లోని అనుబంధ కర్మాగారాలు ఏళ్లుగా మూసి ఉన్నాయి.

పది మంది సభ్యులు గల కమిటీకి ఛైర్మన్‌గా ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సహఛైర్మన్‌గా వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యవహరించనున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ సిఫార్సుల కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులైన ఆర్థిక, పరిశ్రమలు, వ్యవసాయ, సహకారశాఖల ముఖ్యకార్యదర్శుతోపాటు నిజాం షుగర్స్ లిమిటెడ్ ఎండీలు కమిటీ సభ్యులుగా ఉన్నారు.

సిఫార్సుల కమిటీ తన కార్యాచరణను ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభించనుంది. తొలుత హైదరాబాద్‌లో భేటీకానుంది. సమావేశంలో పరిశ్రమలు గతంలో కొనసాగిన తీరుతెన్నులు.. మూతపడేందుకు దారితీసిన పరిస్థితులపై చర్చించనున్నారు. బ్యాంకుల మార్టిగేజ్, యంత్ర పరికరాలు వినియోగ సామర్ధ్యాల అంశాలు కీలకంగా చర్చించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. చక్కెర పరిశ్రమ పూర్వం ప్రభుత్వం అధీనంలో కొనసాగింది. ఆ తర్వాత 51శాతం ప్రైవేటు భాగస్వామ్యం చేతుల్లోకి వెల్లడంతో.. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్‌గా మారింది. చాలాకాలంపాటు నిర్వహణ సమస్యలు ఎదుర్కొంటూ క్రమంగా ఉత్పత్తి తగ్గిపోయి 2015లో మూతపడింది. తిరిగి తెరిపించే విషయంలో కార్మికులు , రైతులు అనేక ఉద్యమాలు చేస్తూ వచ్చారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ.. మూతపడ్డ చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపించే ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ ముఖ్యమంత్రి.. నిజాం చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపించే విషయంలో.. హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. తన పాదయాత్ర సమయంలోనూ రైతులతో మాట్లాడినట్లు తెలిపారు. త్వరలోనే ఈ అంశంపై సిఫార్సుల కమిటీని ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకొని ముందడుగు వేస్తామన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సిఫార్సుల కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. తిరిగి తెరిపించే క్రమంలో 51 శాతంగా ఉన్న భాగస్వామి సుముఖంగా ఉంటే సంయుక్తంగా.. లేకుంటే ప్రభుత్వపరంగా నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం పట్ల రైతులు, కార్మికుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. అదే జరిగితే పరిశ్రమలకు పూర్వ వైభవం వస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story