నేడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌.. తొలి రౌండ్ ఫలితం తేలాలంటే..

నేడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌.. తొలి రౌండ్ ఫలితం తేలాలంటే..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ శుక్రవారం జరగనుంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు కౌటింగ్‌ ప్రారంభం కానుంది. ఒక్కో రౌండ్ ఫలితం రావడానికి కనీసం 2 నుంచి 3 గంటలు సమయం పట్టేలా ఉంది. తొలి ఫలితం 11 గంటలకు కానీ రాదు. 30 కేంద్రాల్లో 150 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేసిన అధికారులు.. ఒక్కో రౌండ్‌లో 14 వేల ఓట్లు లెక్కించనున్నారు. ఐతే, 12 వేల లోపు ఓట్లు పోలైన మెహదీపట్నం ఫలితం ముందుగా వచ్చే ఛాన్స్ ఉంది. అత్యధికంగా 37 వేల ఓట్లు పోలైన మైలార్‌దేవ్‌పల్లిలో కౌంటింగ్‌ పూర్తికావాలంటే సాయంత్రం అవుతుంది. అలాగే గాజులరామారం, అల్లాపూర్‌ సహా మరికొన్ని చోట్ల కూడా పలితం తేలాలంటే సమయం పడుతుంది. గతంలో EVMల ద్వారా ఓటింగ్ కాబట్టి.. తొలి రెండు గంటల్లోనే ట్రెండ్ తెలిసిపోవడం, ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో అర్థమవడం జరిగిపోయేది. కానీ ఈసారి బ్యాలెట్ పోరు కావడంతో రిజల్ట్ ఆలస్యం అవుతుంది.

ఇక కౌంటింగ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆసక్తికరంగా ఉంది. ఎప్పట్లాగే ముందు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. తర్వాత బ్యాలెట్‌ బాక్స్‌లను తెరుస్తారు. అందులో ఓట్లను 25 చొప్పున కట్టలు కడతారు. పోలైన ఓట్లు, బాక్సులో ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరిచూసుకుంటారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోని బాక్సుల్లో ఓట్లు కట్టలు కట్టాక వాటిని ఓ డ్రమ్‌లో వేసి కలుపుతారు. ఏ వార్డులో ఏ పార్టీకి మెజార్టీ వచ్చింది లాంటి వివరాలు బయటకు తెలియకుండా ఉండడం కోసం ఇలా చేస్తారు. ఆ తర్వాత పార్టీల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించి రౌండ్ల వారీగా ఫలితాలు ప్రకటిస్తారు. ఒక్కో టేబుల్‌పైన వెయ్యి ఓట్లు లెక్కిస్తారు. అలా ఒక రౌండ్‌లో 14 వేల ఓట్లు లెక్కిస్తారు. క్యాండేట్ల వారీగా చెల్లుబాటు అయిన ఓట్లు ప్రకటించాక, రీకౌంటింగ్‌ లాంటి డిమాండ్‌లు ఏమీ ఏజెంట్ల నుంచి రాకపోతే రిటర్నింగ్ అధికారి ఫలితాన్ని ప్రకటిస్తారు. డౌట్ ఫుల్ ఓట్ల విషయంలో రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం. ఒకవేళ ఎక్కడైనా డివిజన్‌లో అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లక్కీ డ్రా ద్వారా విజేతను ప్రకటిస్తారు. అటు, ఈ మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయనున్నారు. ఈ మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షించేందుకు సర్కిళ్ల వారీగా అబ్జర్వర్లను నియమించింది ఎన్నికల సంఘం. IAS, IPS, IFS సహా డిప్యూటీ కలెక్టర్లు 31 మందికి ఆ బాధ్యతలు అప్పచెప్పింది.

స్వల్పంగా పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం..? ఏంటి అనే దానిపై ఇప్పటికే ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. అటు, మేయర్ పీఠం ఎవరిదో తెలిసినా ప్రమాణం ఫిబ్రవరిలోనే ఉండబోతోంది. ఫిబ్రవరి 10 వరకూ ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఉన్నందున ఆ తర్వాతే కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక లాంటివి ఉంటాయి.

Tags

Read MoreRead Less
Next Story