TG: అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర

TG: అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర
అకాల వర్షాల రూపంలో అన్నదాతలపై మరో పిడుగు … తడిసిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటున్న కర్షకులు

ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు అకాలవర్షాల రూపంలో మరో కష్టం వచ్చిపడింది. తీవ్రమైన ఎండలకు నీటివనరులు అడుగంటగా..ఎన్నో అవస్థలు పడి పంటను రక్షించుకున్నారు. తీరా చేతికొచ్చే ముందు ప్రకృతి కన్నెర్రకు పెట్టుబడి వర్షార్పణమైంది. ప్రభుత్వమే తడిసిన పంటలను కొనుగోలు చేయాలని బాధిత కర్షకులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్‌, వరంగల్‌, మెదక్‌, కరీంనగర్‌లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. అకాల వర్షాల రూపంలో అన్నదాతలపై మరో పిడుగు పడింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిసి వరదపాలైంది. భారీ ఈదురు గాలులతో కుండపోతగా కురిసిన వానకు ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. మార్కెటింగ్‌ అధికారులు రైతులకు టార్ఫాలిన్లు ఇవ్వకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో వర్షం ధాటికి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వడ్లను కాపాడుకునేందుకు సాగుదారులు నానా కష్టాలు పడ్డారు. అధికారులు జాప్యం చేయకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కాజీపేట, ధర్మసాగర్, వేలేరు, కమలాపూర్ మండలాల్లో, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూర్, తరిగొప్పుల మండలాల్లో వరుణుడి ప్రతాపానికి మామిడి కాత నేలరాలింది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని మండలాల్లో జడివానకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించి పంట పండించినప్పటికీ....తీరా నోటికాడి వచ్చే సమయంలో కన్నీళ్లు మిగిలాయని గోడు వెళ్లబోసుకున్నారు..


నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి, ఇందల్వాయి మండల్లాలో గాలివానకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కొందరు రైతులు టార్ఫాలిన్లు కప్పినప్పటికీ...గాలి ధాటికి అవి కొట్టుకుపోయాయి. ఫలితంగా ధాన్యం రాశులు, బస్తాలు వరద నీటిలో నానుతున్నాయి. సిద్దిపేట మార్కెట్ యార్డులో వడ్లు తడిచాయి. కేంద్రాల నిర్వాహకులు సకాలంలో స్పందించక పోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు... ఎన్నికల విధులతో తమ బాధలు చూసే పరిస్ధితి లేదని వాపోయారు. సరైన వసతులు లేకపోవడం వల్లే నష్టపోయామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు.


వారం నుంచి ఠారెత్తించిన ఎండలు, ఉక్కపోతకు అల్లాడిన భాగ్యనగరవాసులు …తాజా వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. జంటనగరాల్లోని చాలా ప్రాంతాల్లో వరుణుడి చిరుజల్లులతో వాతావరణం చల్లపడింది. రాజేంద్రనగర్‌ పరిధి బాబుల్‌రెడ్డినగర్‌ కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం యాదగిరిగుట్టపైనా వరుణుడు కరుణ చూపాడు. ఇన్నాళ్లు ఎండకు అల్లాడిన భక్తులు... జల్లులకు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story