Drug Peddlers Arrested In Hyderabad : మాదక ద్రవ్యాల రవాణా కింగ్‌పిన్‌ అరెస్ట్

Drug Peddlers Arrested In Hyderabad : మాదక ద్రవ్యాల రవాణా కింగ్‌పిన్‌ అరెస్ట్
40 రోజులపాటు ప్రత్యేక ఆపరేషన్ లో చిక్కిన నైజీరియన్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఏకంగా 8 కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడడం... అనేక రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్న నైజీరియా డ్రగ్ కింగ్ పిన్ స్టాన్లీని తెలంగాణ టీన్యాబ్‌ పోలీసులు పట్టుకోవడం సంచలనంగా మారింది. పెద్దఎత్తున మత్తు పదార్థాలు నగరంలో దొరకడం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 500 పైచిలుకు మత్తుపదార్థాల కొనుగోలుదారులు విక్రయదారులతో స్టాన్లీకి సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. దీంతో ఎవరెవరు ఇతని వద్ద మాదకద్రవ్యాలు కొనుగోలు చేశారనే అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మాదకద్రవ్యాలు స్టాన్లీ వద్ద కొనుగోలు చేసి వాడిన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వివరాలు కూడా రాబడుతున్నారు.

ఎర్రమంజిల్ వద్ద పిన్‌స్టాన్లీని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద అరకిలోకి పైగా కొకైన్‌తో పాటు హెరాయిన్ తదితర మత్తు పదార్థాలు, అమెరికాలో సాగయ్యే గంజాయి ఓషన్ గ్రీన్ కిన్నావిస్ 45 గ్రాములు లభించింది. ఇది ఒక గ్రాముకు 5000 రూపాయల వరకు ధర ఉంటుందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సరఫరాదారు స్టాన్లీ స్వసలం నైజీరియాలోని అనంబ్ర రాష్ట్రం. 2009లో బిజినెస్ వీసాపై ముంబయి చేరాడు. అంధేరి ప్రాంతంలో మిత్రుడు జెవెల్తో కలసి రెడీమేడ్ వస్త్రవ్యాపారం ప్రారంభించాడు. ఏడాది తరువాత గోవా, కండోలిమ్ ప్రాంతాలకు మకాం మార్చి అక్కడా వస్త్ర వ్యాపారం నిర్వహించాడు. క్రమంగా గోవా పరిసర ప్రాంతాల్లోని నైజీరియన్లతో స్నేహం ఏర్పడింది. వారితో కలసి మద్యం, కొకైన్ తీసుకునేవాడు. అడ్డదారిలో పెద్దమొత్తంలో డబ్బు సంపాదనకు డ్రగ్స్ విక్రయం వైపు మళ్లాడు. కొద్దిమొత్తంలో కొకైన్, హెరాయిన్ వంటివి కొనుగోలు చేసి పర్యాటకులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునేవాడు. 2012లో పాస్‌పోర్ట్‌ పోగొట్టుకున్నాడు. దీంతో స్టాన్లీ అక్రమంగా నివాసం ఉంటున్నట్టు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి 6 నెలలు జైల్లో ఉంచారు. జైలు నుంచి విడుదలయ్యాక నిందితుడికి... భర్త నుంచి వేరుగా ఉంటున్న రాజస్థాన్‌కు చెందిన ఉపాచందేల్ పరిచయమైంది. 2014లో వీరిద్దరూ పెళ్లి చేసుకొని కిరాణా దుకాణం ప్రారంభించారు. 2017లో గోవాలో గంజాయి, కొకైన్, ఎండీఎంఏ, ఎక్సటసీ డ్రగ్స్ చేరవేస్తూ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు పట్టుబడి జైలుకెళ్లారు. కరోనా లాక్‌డౌన్‌తో వ్యాపారం మందగించింది. వస్తువులు కొనేందుకు దుకాణానికి వచ్చే ఇద్దరు నైజీరియన్లు స్టాన్లీకి మాదకద్రవ్యాలు చేరవేసే అవకాశం ఇచ్చారు. 2 వేల రూపాయలు కమీషన్ ఇచ్చే ఒప్పందం కుదుర్చుకున్నారు. కరోనా లాక్‌డౌన్ అనంతరం ఇద్దరు నైజీరియన్లు సొంత దేశానికి వెళ్లటంతో ఇతడే సొంత దందా మొదలుపెట్టాడు.

నైజీరియాలో మత్తు సామ్రాజ్యంతో సంబంధాలు ఏర్పరచుకొని స్టాన్లీ కీలకంగా ఎదిగాడు. గోవాలో ఖరీదైన భవనంలో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఇటీవలే కోటి రూపాయల విలువైన కారు కొనుగోలు చేశాడు. అనతికాలంలోనే... గ్రాముల్లో సరఫరా చేసే స్టాన్లీ కిలోల కొద్దీ డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే స్థాయికి ఎదిగాడు. నైజీరియాలో మత్తుపదారాలు తయారు చేసే ముఠాలతో నేరుగా మంతనాలు సాగించేవాడు. అక్కడి నుంచి విమానమార్గంలో నైజీరియన్లు కడుపులో మాదకద్రవ్యాలు దాచి ముంబయి చేర్చేవారు. అక్కడ వ్యాపారాలు చేసే కొందరు నైజీరియన్లను దళారులుగా మార్చి వారి ద్వారా డ్రగ్స్, ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవాడు. పుణెలోని కొరియర్ సర్వీసెస్ ద్వారా మత్తుపదార్థాలను బెంగళూరు, ముంబయి, రాజస్థాన్ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో దళారులు నియమించుకొని 500 మందికిపైగా కొనుగోలుదారులకు... స్టాన్లీ సరుకు చేరవేస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story