హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉంది: అసదుద్దీన్‌

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉంది: అసదుద్దీన్‌
లోక్‌సభలో అసదుద్దీన్‌ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. శనివారం లోక్‌సభలో జమ్మూకశ్మీర్‌ విభజన చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ''చెన్నై, బెంగళూరు, ముంబయి, అహ్మదాబాద్‌, లక్నోను కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చుతుందని అన్నారు. ఇదే విధానంతో బీజేపీ పని చేస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే కశ్మీర్‌ను ఒక ఉదాహరణగా చేసి చూపారని అన్నారు. కశ్మీర్‌ అంశంపై ప్రభుత్వానికి మద్దతుగా పార్లమెంట్‌లో కరతాళ ధ్వనులు చేస్తున్న కొన్ని పార్టీలు.. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలను యూటీలుగా మార్చినప్పుడు గగ్గోలు పెట్టడం ఖాయమని చెప్పారు. ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలు.. భవిష్యత్‌ పరిణామాలకు కూడా సిద్ధంగా ఉండాలని ఒవైసీ హెచ్చరించారు.

అటు.. లోక్‌సభలో అసదుద్దీన్‌ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. హైదరాబాద్‌ సహా ఇతర నగరాల్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చే ఆలోచన బీజేపీకి లేదని అన్నారు. ఈ అంశంపై కేంద్రం సమాధానం చెప్పేలోపే... అసదుద్దీన్‌ లోక్‌సభ నుంచి బయటకు వెళ్లిపోయారని చెప్పారు. హైదరాబాద్‌ను మాత్రమే కాదు... ఏ నగరాన్నీ కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే యోచన లేదని స్పష్టంచేశారు. దేశంలోని అన్ని నగరాల్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

అసదుద్దీన్‌ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఇతర పార్టీల్ని రెచ్చగొట్టడానికే అసదుద్దీన్‌ యూటీపై వ్యాఖ్యలు చేశారని అన్నారు. బీజేపీకి నష్టం చేకూర్చే ఉద్దేశంతోనే అనుచితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

"హైదరాబాద్‌-కేంద్ర పాలిత ప్రాంతం" అనే అంశం.. మరోసారి చర్చనీయాంశమైంది. లోక్‌సభలో కశ్మీర్‌ అంశంపై చర్చ సందర్భంగా అసదుద్దీన్‌ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా హైదరాబాద్‌ భవితవ్యంపై పెద్దఎత్తున చర్చ జరిగింది. యూటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ.. యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడంతో ఆ చర్చ ముగిసింది. కానీ..మళ్లీ అసదుద్దీన్‌ లోక్‌సభలో కామెంట్లు చేయడంతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. కేంద్రానికి అలాంటి ఆలోచన ఏమీ లేదని కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు.



Tags

Read MoreRead Less
Next Story