కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు

కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వేసిన పరువునష్టం దావా కేసులో సిటీ సివిల్‌ కోర్టు మధ్యంత ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వేసిన పరువునష్టం దావా కేసులో సిటీ సివిల్‌ కోర్టు మధ్యంత ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్‌ కేసుతో ముడిపెట్టి కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఈ మేరకు రేవంత్‌రెడ్డికి ఇంజక్షన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఈ కేసు విచారణను అక్టోబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు ఇంజక్షన్‌ ఆర్డర్‌పై వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కేటీఆర్‌ న్యాయస్థానాన్ని కోరారు.

డ్రగ్స్ కేసుతో ముడిపెడుతూ రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారని సోమవారం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ పరువునష్టం దావా వేశారు. తప్పుడు ఆరోపణలను పరువునష్టం చర్యలుగా పరిగణించి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా రేవంత్ రెడ్డిని ఆదేశించాలని సిటీ సివిల్ కోర్టును కోరారు. పత్రికలు, టీవీలు, సామాజిక మాద్యమాల ద్వారా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలన్నారు.

తన పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను ట్విటర్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాద్యమాల నుంచి తొలగించేలా రేవంత్‌ను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈడీ, డ్రగ్స్ కేసుతో ముడిపెడుతూ తనపై తప్పుడు, పరువునష్టం వ్యాఖ్యలు చేయకుండా రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు కేటీఆర్.

Tags

Read MoreRead Less
Next Story