జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవుల్లో పెద్దపులి సంచారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవుల్లో పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మొన్న మహాముత్తారం మండలం యామనపల్లి - ఆజంనగర్ అటవీ ప్రాంతాల మధ్య పెద్దపులి పాదముద్రలు కనిపించాయి. నిమ్మగూడెం అటవీప్రాంతంలో ఓ దుక్కిటెద్దుపై దాడి చేసింది. తాజాగా మలహర్ మండలం కిషన్ రావు పల్లి అటవీ ప్రాంతంలో పులి అడుగులు కనిపించడంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. కిషన్ రావు పల్లి అటవీ ప్రాంతం మీదుగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి వాహనదారులు నిత్యం ప్రయాణిస్తుంటారు. పులి అడుగులు కనిపించడంతో ఒక్కసారిగా భయపడ్డ ప్రయాణికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని పాదముద్రల కొలతలు తీసుకుని పై అధికారులకు సమాచారం అందించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నిండుగా ప్రవహించడంతో మహారాష్ట్ర , ఛత్తీస్గఢ్ అడవుల నుంచి గోదావరి దాటి తెలంగాణలోకి ఈ పులి ప్రవేశించినట్లుగా గుర్తించామన్నారు. పశువుల కాపరులు, గ్రామస్తులెవరూ అడవి వైపు వెళ్లకూడదని హెచ్చరించారు. ఎవరైనా పులికి హాని తలపెట్టాలని ప్రయత్నిస్తే... శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. పెద్దపులి ఎక్కడైనా కనిపించినట్టు సమాచారం ఉంటే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రత్యేకంగా ఒక టీమ్ను ఏర్పాటు చేశామన్నారు D.F.O పురుషోత్తం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com