BRS to Congress : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు

BRS to Congress :  బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు
గులాబీ పార్టీలో గుబులు

బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి. కొందరు నేతలు పార్టీని వీడుతుండగా.. గతంలో పోటీచేస్తామని ప్రకటించిన మరికొందరు.. లోక్‌సభ ఎన్నికల్లో వెనకడుగు వేస్తున్నారు. ముందు సిద్ధమై ఆ తర్వాత పోటీకి వెనకంజ వేయడంతో తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్అధిష్ఠానం దృష్టిసారించింది. నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూనే. ప్రత్యామ్నాయ అభ్యర్థుల కోసం ప్రయత్నిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల ఓటమి ప్రభావం బీఆర్ఎస్పై కొనసాగుతూనే ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో.. ఒకరి తర్వాత ఒకరు నేతలు జారిపోతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వలసలు పోతున్నారు. సిట్టింగ్‌ ఎంపీలతోపాటు మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు.. కాంగ్రెస్, భాజపా గూటికి చేరుతున్నారు. ఆయాపార్టీల నుంచి వారికి లోక్‌సభ అభ్యర్థిత్వాలు ఖరారవుతున్నాయి. ఓవైపు వలసలు కొనసాగుతుంటే మరికొందరు నేతలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి వెనకంజ వేస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించినప్పుడు పోటీకి సుముఖత వ్యక్తంచేసిన నేతలు.. ఆ తర్వాత బరిలో నుంచి తప్పుకుంటున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో అది ప్రారంభమైంది. సన్నాహక సమావేశం సందర్భంగా.. రంజిత్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుంటామని నియోజకవర్గపరిధిలోని నేతలంతా తీర్మానం చేశారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో ఆయన పోటీకి వెనకంజవేశారు. మాజీమంత్రి మహేందర్‌రెడ్డి సతీమణితోపాటు పలువురు నేతలు భారాసను వీడి హస్తంపార్టీలో చేరారు. ఇతర పరిణామాలతో పోటీ చేసేందుకు రంజిత్‌రెడ్డి వెనుకంజవేశారు. ఈ మేరకు అధిష్టానానికి తన అభిప్రాయం తెలిపారు. పార్టీ ముఖ్యనేతలు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొంది. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి తొలుత ఆసక్తిచూపారు. నల్గొండ లేదా భువనగిరి నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఐతే జిల్లాలో పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు అమిత్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగింది. మారిన పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని అధిష్టానానికి.. గుత్తా అమిత్‌రెడ్డి సమాచారమిచ్చినట్లు తెలిసింది. సీనియర్ నేతలు ఇంకా అమిత్‌తో మాట్లాడుతున్నట్లు చెప్తున్నారు.

మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలో అదే పునరావృతమైంది. మాజీమంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలని తొలుత భావించారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం సహా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని MLAలు, నేతలను కలిసి వారితో చర్చించి అధిష్టానం వద్ద సుముఖత తెలిపారు. తన కుమారుడికి అవకాశమిస్తే పోటీచేసి గెలుస్తామని.. పలుసార్లు మల్లారెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఐతే కేటీఆర్‌ను కలిసిన మల్లారెడ్డి, భద్రారెడ్డి.. ఎన్నికల్లో పోటీ చేయబోమని తెలిపారు. ముందు సిద్ధమై ఆ తర్వాత నేతలు పోటీకి వెనకంజ వేయడంతో తదుపరి కార్యాచరణపై భారాస అధిష్ఠానం దృష్టిసారించింది. నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూనే.. ప్రత్యామ్నాయ అభ్యర్థుల కోసం ప్రయత్నిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story