Telangana: ప్రధాని మోదీ ప్రసంగంపై విరుచుకుపడ్డ కేటీఆర్

Telangana: ప్రధాని మోదీ ప్రసంగంపై విరుచుకుపడ్డ కేటీఆర్
తొమ్మిదేళ్లలో దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా ప్రధాని చెప్పాలంటూ డిమాండ్ చేసారు


ప్రధాని మోదీ ప్రసంగంపై విరుచుకుపడ్డారు బీఅర్ఏస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల అన్నారు కేటీఆర్. గుజరాత్ కి 20 వేల కోట్ల రూపాయల లోకోమోటివ్ ఫ్యాక్టరీని మోదీ తన్నుకుపోయారన్నారు. తెలంగాణలో 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అన్నారు. తొమ్మిదేళ్లలో దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా ప్రధాని చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోడీ అంటూ విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాల ఖాళీలు భర్తీచేయకుండా, రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నింపిన మాపై నిందలా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. ఉద్యోగం అడిగితే పకోడీలు వేసుకోమన్న ప్రధాని, యువత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించకుండా యూనివర్సిటీ ఖాళీల భర్తీని అడ్డుకుంటున్న గవర్నర్ కి, ప్రధాని ఒక మాట చెబితే బాగుండేది అన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని అడ్డుకొని, అడవి బిడ్డల గురించి మాట్లాడటం ప్రధాని కపటప్రేమకు నిదర్శనం అన్నారు. 15 వేల మంది స్ధానికులకు ఉద్యోగాలిచ్చే బయ్యారం ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట కూడా ప్రధాని మాట్లాడలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. నల్ల చట్టాలతో 700 మంది రైతులను పొట్టనబెట్టుకున్న ప్రధాని వ్యవసాయం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లే అన్నారు. సమగ్ర వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమంల్రో దేశానికి ఆదర్శం, దిక్సూచి తెలంగాణ అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ మా కుటుంబం అని, రాష్ట్ర ప్రజలు మా కుటుంబ సభ్యులు అన్నారు. వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ కుటుంబ పార్టీ మాది అంటూ మోదీపై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్.

Tags

Read MoreRead Less
Next Story