Telangana: మత్తు పదార్థాల విక్రయదారులపై పోలీసులు ఉక్కుపాదం

Telangana: మత్తు పదార్థాల విక్రయదారులపై పోలీసులు ఉక్కుపాదం
ఇకపై ఆస్తుల జప్తు కూడా

ప్రజల జీవితాలతో చెలగాటమాడే మత్తు పదార్థాల విక్రయదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్, గంజాయి విక్రయాలకు పాల్పడే నేరగాళ్లను ఇకనుంచి కటాకటాల్లోకి నెట్టడమే కాకుండా వారి ఆస్తుల్ని సైతం జప్తు చేస్తున్నారు. ఇలాంటివారిపై చట్ట ప్రకారం ఎన్నిచర్యలు తీసుకుంటున్నా.. మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో తెలిపింది.

రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాల విక్రయం రోజురోజుకీ చాపకింద నీరులా సాగుతోంది. కొందరు యువకులు కమీషన్ల కోసం ఈ దారి ఎంచుకుంటున్నారు. మరికొందరు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి స్మగ్లర్లుగా మారుతున్నారు. వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నా నేరాలు మాత్రం ఆగడంలేదు. నిందితులపై చట్టప్రకారం కేసులు నమోదు చేసినా.. మార్పురావడం లేదు. ఇలాంటి కేసుల్లో ఏళ్ల తరబడి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీస్‌వ్యవస్థ NDPS చట్టాన్ని ఉపయోగించి నేరగాళ్ల ఆట కట్టిస్తోంది. ఇకనుంచి మత్తు పదార్థాల విక్రయాలు జరిపితే ఈ చట్టం ప్రకారం నిందితుల ఆస్తులు జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. నిందితుల అక్రమ ఆస్తులపై ఆధారాలు సహా చెన్నైలోని 'సఫేమా' కార్యాలయానికి నివేదిక పంపిస్తారు. దీన్ని వారు లోతుగా పరిశీలించి ఆమోదం తెలిపిన వెంటనే ఆస్తులు జప్తు చేస్తారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో ఐదారు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసు గుర్తించారు. ఇటీవల ముషీరాబాద్‌కు చెందిన డ్రగ్స్‌ విక్రేత సయ్యద్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కేవలం డ్రగ్స్‌ విక్రయాల ద్వారా కోటి విలువైన కారు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. గతేడాది ఆల్ఫ్రాజోలం విక్రయిస్తూ పట్టుబడ్డ అబ్కారీ శాఖ కానిస్టేబుల్‌ రమేశ్, రంగారెడ్డి జిల్లాకు చెందిన వెంకటయ్య కలిపి 23 కోట్ల మేర స్థిర, చరాస్థులు కూడగట్టినట్లు TS న్యాబ్‌ గుర్తించింది. వీటిని జప్తు చేస్తున్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. గతేడాది ఆగస్టులో 44 కిలోల గంజాయితో వీరన్న, మధు, ప్రశాంత్‌ అనే ముగ్గురు వ్యక్తులను టీఎస్‌ న్యాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 96.55 లక్షల స్థిర, చరాస్థులను జప్తు చేశారు. ఇటీవల నానక్‌రాంగూడలో గంజాయి విక్రయిస్తున్న నీతూబాయి, ఆమె కుటుంబ సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి నుంచి సుమారు 4 కోట్ల విలువైన ఆస్తుల్ని NDPS చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్నారు

Tags

Read MoreRead Less
Next Story