వామనరావు దంపతుల హత్య కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

వామనరావు దంపతుల హత్య కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
న్యాయస్థానానికి అందజేసిన నిందితుల రిమాండ్‌ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలున్నాయి.

న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసు విషయంలో రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కుంట శ్రీను, చిరంజీవి ఇద్దరూ పథకం ప్రకారమే ఈ హత్యలు చేసినట్లు తెలుస్తోంది. వారిద్దరినీ ఘోరంగా నరికి చంపి అక్కడి నుంచి జారుకున్నట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. హత్య జరిగిన రాత్రి కారులోనే ప్రశాంతంగా నిద్రపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి వారు మంథనిలో న్యాయస్థానానికి అందజేసిన నిందితుల రిమాండ్‌ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలున్నాయి.

కల్వచర్ల సమీపంలో వామన్‌రావు, నాగమణిలను హత్య చేసిన అనంతరం నిందితులు నేరుగా కారులో సుందిళ్ల బ్యారేజీకి చేరుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులతో పాటు రక్తసిక్తమైన తమ దుస్తులను బ్యారేజీలో పడేశారు. బ్యారేజీ నుంచి కారులో వాంకిడి చెక్‌పోస్టు వద్దకు చేరుకుని ఆ రాత్రికి నిందితులు వాహనంలోనే పడుకున్నారు. ప్రస్తుత రిమాండ్‌ రిపోర్టును బట్టి హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని తెలుస్తోంది. ఈ మొత్తం కేసులో బిట్టు శ్రీను పాత్ర ఏమిటి అనేది అతడికి సంబంధించిన రిమాండ్‌ డైరీ ద్వారా వెల్లడయ్యే అవకాశముంది.

ఇక కుంట శ్రీనుపై వామనరావు కేసులు, ఫిర్యాదులు చేయడంతోనే పగ పెంచుకున్నట్లు తెలుస్తోంది. కుంట శ్రీనుపై కేసులు, ఫిర్యాదుల గురించి వామన్‌రావు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. కుంట శ్రీను దీనిపై ఫోన్‌లో బెదిరించడంతో వామన్‌రావు అతడిపై హైదరాబాద్‌ వెస్ట్‌మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టారు. మంథని ఠాణాలోనూ కుంట శ్రీనుపై పదుల సంఖ్యలో ఫిర్యాదులుచేశారు.

శ్రీను గుంజపడుగు బస్టాండ్‌ వద్ద స్థలాన్ని కొని భవనం, సమీపంలోనే గుడిని నిర్మిస్తున్నాడు. దీంతో పాటు రాధాగోపాలస్వామి ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయగా.. వీటన్నింటినీ అడ్డుకునేందుకు వామన్‌రావు కేసులు వేయడంతో శ్రీనుకు అతడికి మధ్య వివాదం బాగా ముదిరింది. వామన్‌రావు విషయమై కుంట శ్రీను పలుమార్లు బిట్టు శ్రీనుతో చర్చించి చివరకు ఎలాగైనా, ఎప్పుడైనా చంపేయాలని నిర్ణయించుకున్నారు.

గుంజపడుగులో ఈనెల 17న జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కుంట శ్రీను.. తర్వాత దుబ్బపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యాడు. మంథని చౌరస్తాకు వచ్చేసరికి వామన్‌రావు దంపతులు కారులో మంథని కోర్టుకు వెళ్తుండడం కనిపించింది. వెంటనే బిట్టు శ్రీనుకు ఫోన్‌ చేసి చెప్పాడు. అతడు హత్య చేయడానికి కత్తులు, కారు, డ్రైవర్‌ చిరంజీవితో పాటు కోర్టు వద్ద రెక్కీకి లచ్చయ్య, కుమార్‌లను ఏర్పాటు చేశాడు.

మరోవైపు హత్యలు జరిగిన రోజు నిందితుల మధ్య జరిగిన సెల్ ఫోన్ సంభాషణ కేసులో కీలకంగా మారింది. ఈ నెల 17న కుంట శ్రీను, బిట్టు శ్రీను, లచ్చయ్య, అక్కపాక కుమార్‌ల మధ్య మొత్తం 18 సార్లు సెల్‌ఫోన్‌ సంభాషణలు నడిచినట్లు పోలీసులు గుర్తించారు. బిట్టు శ్రీను-కుంట శ్రీను మధ్య 11 సార్లు, కుంట శ్రీను-లచ్చయ్య మధ్య 5 సార్లు కాల్స్‌ వెళ్లాయి. బిట్టు శ్రీను, కుంట శ్రీను చెరోసారి కుమార్‌తో మాట్లాడారు. వీరు ఏం మాట్లాడుకున్నారే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక హత్యల కోసం బిట్టు శ్రీను మంథనిలో కత్తులు తయారు చేయించాడు. వాటిని తయారుచేసి ఇచ్చిన రఘు, శ్రీను, బాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అటు వామన్‌రావు తండ్రి కిషన్‌రావుతో పాటు ఘటనా స్థలంలో హత్యను వీడియో చిత్రీకరించిన వారి నుంచి కూడా వాంగ్మూలం తీసుకోవాలని పోలీసులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఇక ఈనెల 17న మధ్యాహ్నం 2గంటల 26నిమిషాలకు పన్నూర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి నిందితుల కారు కల్వచర్ల వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డైంది. మధ్యాహ్నం 2గంటల 29నిమిషాలకు వామన్‌రావు దంపతుల కారు కల్వచర్లకు వెళ్లింది. మధ్యాహ్నం 2గంటల 41నిమిషాలకు హత్య తర్వాత నిందితులు వారి కారులోనే మంథనికి వెళ్తున్నట్లు తెలంగాణ చౌరస్తా దగ్గర ఉన్న సీసీ కెమెరాలో లభ్యమైంది. అంటే అంతా కొద్దినిమిషాల్లోనే పూర్తి చేసేసినట్లు అర్థమవుతోంది. అయితే మొత్తంగా ఘటనకు సంబంధించి ప్రణాళిక పూర్తయ్యేసరికి రెండు గంటలు పట్టింది.

అటు వామన్‌రావు కారులో పోలీసులకు పలు దస్తావేజులు, పదులకొద్దీ ఫిర్యాదు పత్రాలు, సమచార హక్కు దరఖాస్తులు దొరికాయి. వాటిలో మంథని ఎంపీడీవో, తహసీల్దార్‌లకు, గుంజపడుగు పంచాయతీ కార్యదర్శికి ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన పత్రాలు ఉన్నాయి. గుంజపడుగులో ఆయుత చండీయాగం కోసం బందోబస్తు కోరుతూ వామన్‌రావు తమ్ముడు ఇంద్రశేఖర్‌ పేరుతో రాసిన వినతిపత్రాలు లభించాయి. అంతా బాగుంటే సరిగ్గా ఈ ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు యాగం జరిగి ఉండేది. అలాగే వెల్ది వసంతరావు అనే వ్యక్తి వాట్సప్‌ గ్రూపుల్లో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇంద్రశేఖర్‌ పేరుతో 24 పేజీల ఫిర్యాదు పత్రాలు లభించాయి.

మరోవైపు హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీనును మంగళవారం అర్ధరాత్రి మంథని అడిషనల్‌ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. బిట్టు శ్రీనుకు 14 రోజుల రిమాండ్‌ విధించి.. కరీంనగర్‌ జిల్లా జైలుకు తరలించారు. కరీంనగర్‌ కారాగారంలో ఉన్న కుంట శ్రీనివాస్‌, చిరంజీవి, కుమార్‌లను వరంగల్‌ కేంద్ర కారాగారానికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story