మరోసారి నోరు జారిన మంత్రి గంగుల కమలాకర్.. చంద్రబాబును దీవించాలంటూ..!
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మళ్ళీ నోరు జారారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న చంద్రబాబుకు దీవెనలు అందించాలని మంత్రి గంగుల కోరారు. అయితే వెంటనే తన తప్పును గ్రహించి... కేసీఆర్ని దీవించండంటూ సరిదిద్దుకున్నారు. కరీంనగర్ రూరల్ జిల్లాలో పర్యటించిన మంత్రి గంగుల...ఇరుకుల్ల గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి సభలో ఇలా నోరు జారారు. దీంతో అక్కడివారంతా అవాక్కయ్యారు. ప్రసంగం చివరిలో ఆసరా ఫించన్లు ఇచ్చి ఆదుకున్నందుకు ఆశీర్వాదించలా వద్దా అని అడిగిన మంత్రి... ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న చంద్రబాబుకి దీవెనలు అందించాలంటూ వ్యాఖ్యానించారు. వెంటనే కేసీఆర్ అని చెప్పి తప్పు సరిచేసుకున్నారు. టీడీపీని వదిలి పదేళ్ళు అయినా... చంద్రబాబు మాత్రం మంత్రి గుండెల్లో ఇంకా ఉన్నారని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com