జీహెచ్ఎంసీలో హౌసింగ్ కార్యక్రమాలపై కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి సమీక్ష

జీహెచ్ఎంసీలో హౌసింగ్ కార్యక్రమాలపై కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి సమీక్ష
గతంలో ఇల్లు అందిన వారికి మరోసారి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాకుండా చూడాలని మంత్రులు సూచించారు

జీహెచ్ఎంసి పరిధిలో కొనసాగుతున్న హౌసింగ్ కార్యక్రమాలపై గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి కావడానికి గడువు సమీపిస్తున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియ చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ శాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఇతర జిల్లాల కలెక్టర్‌లతో కలిసి సంయుక్తంగా లబ్ధిదారుల ఎంపిక చేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికపై ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని సూచించారు. అలాగే ఇతర జిల్లాల పరిధిలో కడుతున్న ఇళ్లలో పది శాతం లేదా 1000 మించకుండా స్థానికులకు ఇల్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందని మంత్రులు తెలిపారు.

గతంలో ఇల్లు అందిన వారికి మరోసారి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాకుండా చూడాలని మంత్రులు సూచించారు. దీంతో పాటు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలని.. తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో హౌసింగ్ శాఖ అధికారులతో కలిసి పని చేయాలని ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది అని అధికారులు మంత్రులకు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం కొనసాగుతున్న ప్రాంతాల్లో గ్రీనరీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటి నుంచే అక్కడ మొక్కల పెంపకం చేపట్టాలని మంత్రులు సూచించారు. త్వరలోనే మరోసారి హౌసింగ్ శాఖ అధికారులతో సమావేశం అవుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story