తెలంగాణలో కొత్త మున్సిపల్ చట్టంపై బీజేపీ పోరుబాట
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త మున్సిపల్ చట్టంపై బీజేపీ పోరుబాట పట్టింది. రాజ్యంగ విరుద్దంగా అనేక అంశాలు చేర్చారని.. ఆ క్లాజ్లను వెంటనే తొలగించాలంటూ మండిపతోంది. దీనిపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు.. ప్రజా వ్యతిరేక క్లాజ్లను తొలగించకపోతే.. పోరాటం ఇంకాస్త ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణలో కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చింది. అసెంబ్లిలో నూతన చట్టానికి లాంచనంగా ఆమోదం లభించింది. అన్ని పార్టీలు కొన్ని సవరణలు సూచించిన తరువాత ప్రభుత్వం.. తాను రూపొందించిన చట్టాన్ని మూజువాని ఓటుతో ఆమోదించుకునేలా చేసింది. కొత్త చట్టంతో మునిసిపాలిటీల్లో కలెక్టర్లకు పూర్తి అధికారాలు రాబొతున్నాయి. అయితే కలెక్టర్ల పెత్తనం పెరగడం.. స్థానిక ప్రజా ప్రతినిధుల, అధికారుల హక్కులు హరించేలా చట్టం ఉందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కొత్త చట్టంలో అనేక అభ్యంతరాలు ఉన్నాయనంటూ బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపించారు మాజీ మంత్రి డీకే అరుణ. మున్సిపల్ కొత్త చట్టం పేరుతో స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులు తప్పు చేస్తే తొలగిస్తామంటున్న కేసీఆర్ నే ముందుగా రిమూవ్ చేయాలన్నారు డీకే అరుణ. ప్రధాని మోదీ భయం పట్టుకున్న కేసీఆర్..బీజేపీ గెలుపుపై ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని అన్నారు. మున్సిపల్ చట్టంలో ప్రజా వ్యతిరేక అంశాలను తొలగించేలా ప్రభుత్వన్ని ఆదేశించాలని బీజేపీ నేతల బృందం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిసింది. ఎన్నికల కమిషన్ను పక్కన పెట్టి రిజర్వేషన్లు, ఎన్నికల తేదీలను తామే నిర్ణయిస్తామని కేసీఆర్ అనడం అప్రజాస్వామికమన్నారు మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ. మునిసిపాలిటీ కొత్త చట్టం తీసుకు రావడం మంచిదే అంటున్న బీజేపీ నేతలు ప్రజా, రాజ్యంగ వ్యతిరేకంగా ఉన్న అంశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ పోరాటాన్ని ఇంకాస్త ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com