Drug Case: రాడిసన్ డ్రగ్స్ కేసు లేటెస్ట్ అప్డేట్
హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితుల వెనుక గుట్టు లాగితే మత్తు పదార్థాల నెట్వర్క్ బయటపడింది. ఫిబ్రవరి 25న నమోదైన ఈ కేసులో పట్టుబడ్డవారికి మాదకద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆరా తీయగా గోవా, బెంగళూరుతో పాటు.. హైదరాబాద్లో భారీ నెట్వర్క్ నిర్వహిస్తున్న కీలక నిందితుడు చిక్కాడు. దాదాపు మూడేళ్లుగా ఆరు కేసుల్లో పరారీలో ఉన్న సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ను, అతనికి డ్రగ్స్ అందించే నరేంద్ర శివనాథ్ను గచ్చిబౌలి, మాదాపూర్ SOT పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్లోని ముషీరాబాద్కు సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ చిన్న వయసులోనే విలాసాలకు అలవాటుపడ్డాడు. జల్సాల కోసం తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా 2021లో మాదకద్రవ్యాల దందాలోకి అడుగుపెట్టాడు. డ్రగ్స్ నెట్వర్క్లో పట్టు పెంచుకున్న రెహ్మాన్.. హైదరాబాద్కు చెందిన ప్రస్తుతం గోవాలో ఉండే ఉస్మాన్ అలియాస్ ఫైజల్తో పరిచయం ఏర్పడింది. గోవాలోని కొల్వాలే జైలులో ఉండే ఫైజల్.. దేశవ్యాప్తంగా అన్ని నగరాలకు డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్కు కింగ్పిన్లా వ్యవహరిస్తున్నాడు. రెహ్మాన్ తనకు డ్రగ్స్ అవసరమున్న ప్రతిసారీ ఫైజల్ను సంప్రదించేవాడు. ఫైజల్ తన నెట్వర్క్ ద్వారా మత్తుమందును దిల్లీలో డెలివరీ చేయిస్తాడు. రెహ్మాన్ అనుచరుడు, దిల్లీకి చెందిన నరేంద్ర శివనాథ్ అక్కడ అందుకుంటాడు. ఆ తర్వాత రెహ్మాన్, శివనాథ్ ఇద్దరూ కలిసి ముంబయి, బెంగళూరు, హైదరాబాద్లో విక్రయిస్తారు. ఇందుకోసం ఈ మూడు నగరాల్లో 15 మంది చొప్పున అనుచరుల్ని నియమించుకుని రెండుచేతులా సంపాదిస్తున్నారు. కేవలం పబ్బుల దగ్గర యువతకు మాత్రమే అమ్మకం సాగిస్తారు. రెహ్మాన్ డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చే డబ్బుతో విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ముంబయి, బెంగళూరు, హైదరాబాద్లో నెట్వర్క్ నడిపిస్తున్న అబ్దుల్ రెహ్మాన్పై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఆరు కేసులున్నాయి. ఫిబ్రవరి తొలివారంలో గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో డ్రగ్స్ బానిసైన యువతిని వేధిస్తూ ఆమెతో మత్తు పదార్థాలు విక్రయించిన కేసులో అబ్దుల్ రెహమాన్ నిందితుడిగా ఉన్నాడు. నిందితుడు పోలీసులకు చిక్కకుండా వేర్వేరు నగరాల్లో సంచరిస్తూ నెట్వర్క్ నడిపిస్తున్నట్లు తేలింది. ఈ కేసులు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అబ్దుల్ రెహ్మాన్, శివనాథ్ చిక్కారు. కాగా రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వ్యవహారంలో ఫిబ్రవరి 25న మంజీరా గ్రూపు డైరెక్టర్ వివేకానంద్ అతని స్నేహితులు నిర్భయ్, రఘు చరణ్, కేదార్, సందీప్, నీల్, సినీ దర్శకుడు క్రిష్, శ్వేత, లిషిపై కేసు నమోదైంది. అసలు వీరికి డ్రగ్స్ ఎలా చేరుతున్నాయని పోలీసులు కూపీలాగగా మంజీరా గ్రూపు సంస్థల మాజీ ఉద్యోగి సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీ.. వివేకానంద్కు అందిస్తున్నట్లు తేలింది. అతణ్ని అరెస్టు చేసి విచారించగా అత్తాపూర్లోని ఓ రెస్టారెంట్లో క్యాషియర్గా పనిచేసే మీర్జా వహీద్ బేగ్ ద్వారా వస్తున్నట్లు తేలింది. అతన్ని అరెస్టు చేసి విచారించగా ముషీరాబాద్కు చెందిన సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ లింకు బయటపడింది. రెహ్మాన్ ఆచూకీని మాడువారాల గాలింపు తర్వాత కనిపెట్టారు. గోవా జైలులో ఉన్న ఫైజల్ను త్వరలోనే విచారిస్తామని పోలీసులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com