Rahul Gandhi: తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీ ట్వీట్.. ఎమ్మెల్సీ కవిత కౌంటర్..
Rahul Gandhi: సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణలోని సమస్యలపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్వి రాజకీయాలంటూ విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలు విషయంలో.. బీజేపీ, టీఆర్ఎస్ నైతిక బాధ్యత విస్మరించాయన్న రాహుల్.. రైతుల శ్రమతో రెండు పార్టీల రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణలో రాజకీయంగా టీఆర్ఎస్తో తేల్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహం రచించింది.
తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు.
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2022
రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి.
ఇందులో భాగంగా.. రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో తెలంగాణపై ఫోకస్ పెట్టనున్నారు. ఆ దిశగానే పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేయనున్నారు. అటు.. కేసీఆర్ ఈజ్ స్నేక్ అంటూ పార్టీ నేతలతో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ధాన్యం కొనుగోళ్లపై రాహుల్గాంధీ కామెంట్కు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఒక ఎంపీగా నామమాత్రంగా ట్వీట్లతో సంఘీభావం తెలపకుండా.. పార్లమెంట్లో పోరాడాలని సలహా ఇచ్చారు.
తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయంటూ రాహుల్గాంధీ ట్వీట్ చేశారు. రెండు పార్టీలు రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు అని కామెంట్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాహుల్ ట్వీట్పై మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత.
ఒక దేశం ఒకే సేకరణ విధానం కోసం పార్లమెంట్లో డిమాండ్ చేయాలని రాహుల్గాంధీకి సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదంటూ తమ పార్టీ ఎంపీలు రోజూ పార్లమెంట్ వెల్లోకి వెళ్లి పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు. నిజాయితీ ఉంటే రాహుల్గాంధీ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి పోరాడాలని సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com