RAHUL: నాపేరు వింటేనే కేసీఆర్‌ ఉలిక్కిపడుతున్నారు

RAHUL: నాపేరు వింటేనే కేసీఆర్‌ ఉలిక్కిపడుతున్నారు
కలలోనూ తనను తలుచుకుంటున్నారన్న రాహుల్‌గాంధీ

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఎన్నికల రణక్షేత్రంలో కాంగ్రెస్‌ దూకుడుగా సాగుతోంది. పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి అగ్రనేత రాహుల్‌గాంధీ బస్సుయాత్రతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. తొలివిడతగా మూడ్రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో పర్యటించిన రాహుల్‌.... రెండో విడతలో భాగంగా తొలిరోజు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రచారం సాగించారు. భారత్‌ జోడో యాత్ర తర్వాత ప్రధాని మోఢీ, కేసీఆర్‌ కలలోకి వస్తున్నానని తనను తలచుకుని వారు ఉలిక్కిపడుతున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు నేటికి చెక్కుచెదరలేదని... KCR నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోతున్నాయని విమర్శించారు.తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుందన్న రాహుల్‌... కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి ద్వారా KCR దోచుకున్న సొమ్మును రాబడతామని హెచ్చరించారు. తెలంగాణలో 2 శాతమైనా ఓట్లు లేని భాజపా.... BCని ముఖ్యమంత్రిని చేస్తామనటం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, భాజపా-భారాస-MIM సంబంధాలపై విమర్శలు గుప్పిస్తూ రాహుల్‌గాంధీ ప్రసంగించారు. లక్షన్నర కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు అప్పుడే బీటలు వారుతున్నాయని రాహుల్‌గాంధీ విమర్శించారు. KCRను ఓడించి... దోపిడీ చేసిన సొమ్మును రాబడతామన్నారు.


కల్వకుర్తి నుంచి జడ్చర్లకు చేరుకున్న రాహుల్‌గాంధీ అక్కడ జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు. 50శాతానికి పైగా ఉన్న OBCలకు భారాస, భాజపాలు వ్యతిరేకమన్న రాహుల్‌... రాష్ట్రంలో 2శాతం ఓట్లున్న భాజపా.... బీసీని సీఎం చేస్తామనటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే OBCల జనగణన చేపడుతామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు.

జడ్చర్ల కార్నర్‌ మీటింగ్ అనంతరం షాద్‌ నగర్‌ వచ్చిన రాహుల్‌... రైల్వే స్టేషన్‌ నుంచి షాద్‌నగర్‌ చౌరస్తా వరకు పాదయాత్ర చేసి.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. కల్వకుర్తిలో జరిగే విజయభేరీ సభకు వెళ్లే క్రమంలో మార్గమధ్యలో ఆగిన రాహుల్‌గాంధీ.... నాగర్ కర్నూల్ జిల్లా జిల్లెల గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు. అప్పుల బాధతో రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు ఎదురుశెట్టి చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్‌ వారి పరిస్థితిని చూసి చలించారు. రైతు భార్య తిరుపతవ్వ, కుమారునితో మాట్లాడారు. అసంపూర్తిగా ఉన్న వారింటిని చూసి, పూర్తి చేయించాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. అరగంటపాటు చంద్రయ్య భార్యాబిడ్డతో ముచ్చటించి, వారితో కలిసి జొన్నరొట్టె తిన్నారు. అనంతరం, వారి పంట పొలాన్ని పరిశీలించి, బోర్లలో నీరు లేకపోవటానికి కారణాలను ఆరా తీశారు.

Tags

Read MoreRead Less
Next Story