సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌..!

సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌..!
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్ చెప్పారు. కార్మికులు, ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచాలని నిర్ణయించారు.

Singareni Employee retirement Age Hike: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్ చెప్పారు. కార్మికులు, ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచాలని నిర్ణయించారు. సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు, ఇతరత్రా అంశాలు, వాటి పరిష్కారాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షించిన కేసీఆర్‌. పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలని సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో సంస్థలో మొత్తంగా 43 వేల 899 మంది ఉద్యోగులు, అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు ఈనెల 26న జరిగే బోర్డు మీటింగ్‌లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని కేసీఆర్‌ తీసుకున్నారు. అలాగే రామగుండంలో సింగరేణి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

సింగరేణి కార్మికుల సమస్యలతో పాటు ఆ ప్రాంత పరిధిలోని సమస్యలపైనా మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించారు. ఆయా నియోజకవర్గాల్లోని జా సమస్యలను మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణి పరిధిలో బాధితులకు ఇండ్ల స్థలాలను సింగరేణి సంస్థ కేటాయించి కలెక్టర్లకు అప్పగించిందని వాటిని సత్వరమే పంపిణీ చేయాలని ఎమ్మెల్యేలు చేసిన అభ్యర్థనకు సీఎం కేసీఆర్‌ స్పందించారు. దాదాపు 30 వేల మందికి లబ్ధి చేకూర్చే అంశాన్ని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇక సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో బొగ్గు తవ్వకం, రవాణా ద్వారా పొల్యూషన్, రోడ్లు పాడవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని.... అక్కడ మౌలిక వసతుల కల్పన కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులను ఇక నుంచి ఉమ్మడి జిల్లాకు కాకుండా ఇటీవల రాష్ట్రపతి ఆమోదించిన జిల్లాల వారిగానే కేటాయించబడుతాయని సీఎం తెలిపారు. తెలంగాణలో నోటిఫై చేసిన 33 జిల్లాలుగానే భావించాలని సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అదిలాబాద్, మంచిర్యాల, పెద్దపెల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం,ఖమ్మం జిల్లాలు, ఆయా జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలకే డిఎంఎఫ్‌టి నిధులు కేటాయిస్తామని కేసీఆర్‌ తెలిపారు.

దేశంలోని బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణి సంస్థ అగ్రగామిగా దూసుకుపోతుందని.... ఎక్కడాలేని విధంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ రాకముందు 12 వేల కోట్లగా ఉన్న సింగరేణి ఆదాయం... ఈ సంవత్సరం దాదాపు 27 వేల కోట్లకు చేరుకోనుందన్నారు. సొంత స్థలాలున్న పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం నగదు రూపంలో సాయం చేయాలని ఎమ్మెల్యేలు సీఎంను కోరారు. గతంలో పేదలకు నిర్మించి ఇచ్చిన ఇందిరమ్మ, ఎన్టీఆర్ గృహాలు శిధిలావస్థకు చేరుకున్నాయని.,వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించి ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ అంశం పై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న దళిత బంధు పథకాన్ని., అర్హులైన దళిత కుటుంబాలకు చేరే విధంగా కృషి చేయాలని కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారవుతున్నాయని తెలినారు. దళిత బంధు పథకం ద్వారా దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పులు జరుగుతాయని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story