TS: రేపటితో ముగియనున్న సర్పంచుల పదవీకాలం

TS: రేపటితో ముగియనున్న సర్పంచుల పదవీకాలం
ప్రత్యేక అధికారుల పాలనలోకి గ్రామాలు... రికార్టులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశం...

తెలంగాణలో ఫిబ్రవరి ఒకటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్‌బుక్కులు, డిజిటల్‌ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. రేపటి(గురువారం)తో సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున ఇవాళే వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ప్రస్తుతం డిజిటల్‌ సంతకాల కీలు పెన్‌డ్రైవ్‌ల రూపంలో సర్పంచులు, ఉప సర్పంచుల వద్ద ఉన్నాయి. వాటిని పంచాయతీ కార్యదర్శులు స్వాధీనం చేసుకోనున్నారు. ఫిబ్రవరి రెండో తేదీన విధుల్లో చేరనున్న ప్రత్యేకాధికారులకు ప్రభుత్వం డిజిటల్‌ సంతకాల కీలను ఇవ్వనుంది. ఇప్పటి వరకు సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్‌ చెక్‌పవర్‌ ఉండగా ఇకపై ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్‌ చెక్‌పవర్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులకు సంబంధించి వారిద్దరి సంతకాలతో నిధులు డ్రా చేసుకొని వెచ్చించే వీలుంటుంది.


తెలంగాణలోని అన్ని మండల కేంద్రాలకు జిల్లా స్థాయి అధికారి ప్రత్యేకాధికారిగా ఉంటారు. మేజర్‌ గ్రామ పంచాయతీలకు తహసీల్దార్లు, పెద్ద జనాభా గల ఇతర గ్రామాలకు ఎంపీడీవోలు, ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన. ఉప తహసీల్దార్లు, మండల పంచాయతీ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల మూడో తేదీన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలన ఎలా ఉండాలో వారికి మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో 2018 ఆగస్టులోతొలిసారిగా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన వచ్చింది. జనవరి వరకు ఆరు నెలల పాటు కొనసాగింది. ఆ తర్వాత ప్రత్యేకాధికారుల పాలన రావడం ఇది రెండోసారి.

Tags

Read MoreRead Less
Next Story