దొంగ ఓటు వేసిన తాండూరు మున్సిపల్ ఛైర్మన్..!
ఆమె ఓ ప్రజా ప్రతినిధి. ఏకంగా ఓ మున్సిపాల్టీకి ఛైర్మన్. కానీ హోదా మరచి ప్రవర్తించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసి అడ్డంగా దొరికిపోయారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఛైర్మన్ తాటికొండ స్వప్న.. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో తోటి కోడలు పేరుతో ఉన్న ఓటు వేశారు. దీన్ని గుర్తించిన విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి విచారణ జరిపిన వికారాబాద్ కలెక్టర్... స్వప్న దొంగ ఓటు వేసినట్లుగా నిర్ధారించారు. దొంగఓటు వేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన స్వప్నను వెంటనే మున్సిపల్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని... డిమాండ్ చేస్తూ... కాంగ్రెస్, సీపీఐ, జనసమితి కౌన్సిలర్లు.. మున్సిపాల్టీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com