Telangana Budget 2022: తెలంగాణ వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం..

Telangana Budget 2022: తెలంగాణ వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం..
Telangana Budget 2022: తెలంగాణ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Telangana Budget 2022: తెలంగాణ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రగతి భవన్‌లో సమావేశమైన మంత్రిమండలి, 2022-23 ఆర్దిక సంవత్సరానికి ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులు, వివిధ అంశాలను మంత్రులకు సీఎం కేసీఆర్ వివరించారు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

ఉద్యోగాల నియామకాలు.. పాఠశాలల్లో ఇంగ్లీష్‌ బోధన, మన ఊరు- మనబడి , యాదాద్రి మహా కుంభసంప్రోక్షణ, తదితర అంశాలపై చర్చించారు. వీటితోపాటు వివిధ రంగాల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలపై సీఎం కేసీఆర్ మంత్రులకు తగుసూచనలతో సన్నద్దం చేశారు. ఈ బడ్జెట్ సమావేశాలు హాట్‌ హాట్‌గా జరిగే అవకాశం ఉంది.

సాంప్రదాయబద్దంగా వస్తున్న గవర్నర్ ప్రసంగాన్ని ప్రభుత్వం రద్దుచేయడాన్ని ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా తప్పుపడుతుండగా.. ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రంలోని సమస్యలపై గులాబీ పార్టీని టార్గెట్ చేయనుండటంతో ,.... వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు అధికార టీఆర్ ఎస్ సర్వసన్నద్ధం అయింది.

దీనిలో భాగంగా కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రులకు వారిశాఖల వారిగా అనుసరించాల్సిన వ్యూహాంపై దిశానిర్దేశం చేశారు. గత సమావేశాలు ప్రొరోగ్ కానందున ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. బడ్జెట్ సమావేశాల తొలిరోజే ఆర్థిక మంత్రి హరీష్ రావు సభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

ఇక కరోనా నుంచి కోలుకున్న రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్న క్రమంలో బడ్జెట్ అంచనాలు భారీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి,పెరిగిన జీతభత్యాలతోపాటు దళితబంధు లాంటి మెగా స్కీమ్స్ అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఏటా బడ్జెట్లో 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలను దళిత బందు కోసం కేటాయిస్తామని ఇప్పటికీ ప్రభుత్వం చెప్పింది.

ఈ నేపథ్యంలో గత బడ్జెట్ కంటే 15 శాతం అంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రెండు లక్షల 50 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబందించి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా బడ్జెట్ పద్దులపై అంశాలవారీగా చర్చ జరుగాల్సి ఉంటుంది.

అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలు వీలైనంత ఎక్కువ రోజులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ ఆమోదంతో పాటు కీలక బిల్లులను కూడా ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు, గ్రాంట్లు, ప్రత్యేక సహాయం వంటి పూర్తి వివరాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.

బడ్జెట్ సమావేశాలు ఈసారి గరంగరంగా సాగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న టిఆర్ఎస్ నేతలు అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. గత ఎనిమిదేళ్లుగా కేంద్ర బడ్జెట్ తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చెబుతున్న టిఆర్ఎస్.. అంశాల వారీగా ఏ మేరకు రాష్ట్రానికి నష్టం జరిగిందో లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేయనున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఒక తీరుగా.. తెలంగాణకు మరో విధంగా కేంద్రం వివక్ష చూపుతోందని బీజేపీని నిలదీయనున్నారు. కేంద్రం తీసుకువచ్చిన రైతాంగ వ్యతిరేక విధానాలు, బొగ్గు గనుల వేలం, విభజన హామీలు నెరవేర్చడంలో గత ఎనిమిదేళ్లుగా కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని అసెంబ్లీ వేదికగా తూర్పార పట్టనున్నారు. సెస్ పేరుతో పన్నుల మీద పన్నులు వేస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను వేధిస్తున్న తీరుపై బడ్జెట్ సమావేశంలో టిఆర్ఎస్ సర్కార్ ఎండగట్టనుంది.

రాష్ట్రాలకు సర్ ఛార్జ్, సెస్సులను వేస్తూ ఆదాయం రాకుండా కేంద్రం మోసం చేస్తుందని సభా వేదికగా సర్కారు నిరసన తెలిపనుంది. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై చర్చ కంటే రాజకీయంగా విమర్శలే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. టిఆర్ఎస్ ప్రభుత్వానికి --కేంద్రానికి మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్‌కు అసెంబ్లీ వేదిక కానుంది.

Tags

Read MoreRead Less
Next Story