TS: తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు

TS: తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు
రాష్ట్ర గీతంగా జయజయహే తెలంగాణ... అధికార చిహ్నంలోనూ మార్పులు... మంత్రి వర్గం కీలక నిర్ణయాలు

తెలంగాణ (Telangana) తల్లి విగ్రహ రూపం, తెలంగాణ అధికార చిహ్నంలో మార్పులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర గీతంగా అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణను మంత్రిమండలి ఖరారు చేసింది. వాహనాల రిజిస్ట్రేషన్‌లో TSను TGగా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మరో రెండు కొత్త పథకాల అమలును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తారని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Srinivasa Reddy), శ్రీధర్ బాబు (Sridhar Babu) వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు మూడు గంటలకుపైగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి విగ్రహం ఒక వ్యక్తిని ఊహించుకునేలా ఉందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులు, చేర్పులు చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. రాష్ట్ర గీతంగా అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణను మంత్రిమండలి ఆమోదించింది. వాహనాల రిజిస్ట్రేషన్లలో TSను TGగా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. గత పాలకులు తమ పార్టీ పేరును పోలి ఉండేలా టీఎస్‌ను పెట్టారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.


తెలంగాణలో కులగణన చేయాలని కేబినెట్ తీర్మానించింది. ఈనెల 8వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఆరు గ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై సంతృప్తి వ్యక్తం చేసింది. మరో రెండు కొత్త పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తారని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు తెలిపారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్‌ను త్వరలో అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు సమాచారం.


తెలంగాణలోని 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రాజేంద్రనగర్‌లో హైకోర్టుకు 100 ఎకరాలను కేబినెట్ కేటాయించింది. ఖైదీలకు క్షమాభిక్ష కోసం అవసరమైన ప్రక్రియను చేపట్టాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వ్యవసాయశాఖలో ఏఈవో ఖాళీలను నింపాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గ్రూప్-1 ఇతర నియామకాలకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తి కాలేదన్నారు. ధరణి కమిటీ నివేదిక త్వరలో వస్తుందని.. దానిపై అసెంబ్లీలో చర్చిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మెగా డీఎస్సీ కోసం భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టులను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారని మంత్రి పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story