Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ దృష్టి..

Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ దృష్టి..
Telangana: సర్కారు కార్యక్రమాల్లో ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారు.

Telangana: ప్రభుత్వ పరిపాలన, అధికారుల పనితీరు.. సర్కారు కార్యక్రమాల్లో ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారు. వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీ..సర్దుబాటు వివరాలతోపాటు తదితర అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కమిటీని నియమించారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలోని 33 జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా పూర్తి కావడంతో ఉద్యోగుల పనితీరుపై దృష్టిపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్ని స్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యంపై అధ్యయనం చేసి సూచనలు ఇచ్చేందుకు నలుగురు ఐఏఎస్‌ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్.

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ ఐజీ అండ్‌ కమిషనర్‌ శేషాద్రి అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఈ కమిటీలో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ దివ్యలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 38వేల 643 మంది ఉద్యోగులను ఉమ్మడి జిల్లాల్లో సర్దుబాటు చేయగా.. 101 మంది మినహా.. 38వేల 542 మంది ఉద్యోగులు ఆయా స్థానాల్లో చేరిపోయారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఆయా జిల్లాల్లో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్‌ జారీచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, జిల్లా పోలీసు భవనాల నిర్మాణం, జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును ఇంకా మెరుగుపరుచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి నివేదిక అందించాలని సీఎం ఈ కమిటీకి సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బంది అయిన ఆర్డీవోలు, వీఆర్వోలు, వీఆర్‌ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త జిల్లాల్లో, కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో ఏయే శాఖలకు పని ఒత్తిడి ఎంత ఉందో అంచనా వేసి దానికి అనుగుణంగా ఇంకా కొత్తగా పోస్టుల అవసరాన్ని గుర్తించడం, కొత్తగా సాంకేతికంగా ఏమేం చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

రాష్ట్రంలో మెరుగైన పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు అద్భుతమైన సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు సీఎం కేసీఆర్. ప్రజలకు నిత్యం ఎక్కువగా అందుబాటులో ఉండాల్సిన విద్య, వైద్యం, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా మెరుగైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉద్యోగుల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై తగు సూచనలు చేయాలని సీఎం కేసీఆర్ కమిటీకి సూచించారు.

ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశాలు ఇచ్చారు. అయితే కమిటీ అధ్యయనంలో వెల్లడైన సూచనల ప్రకారం పరిపాలనతో మార్పులు తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. పరిపాలనలో తమ మార్కును చాటుకునేలా చర్యలు చేపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story