మావోయిస్టుల కదలికల కట్టడికి పోలీసు అధికారుల త్రిముఖ వ్యూహం

మావోయిస్టుల కదలికల కట్టడికి పోలీసు అధికారుల త్రిముఖ వ్యూహం
ఉత్తర తెలంగాణలో పెరుగుతున్న మావోయిస్టుల కదలికలను కట్టడి చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు త్రిముఖ వ్యూహాన్ని రచిస్తున్నారు. మావోలపై ఉక్కుపాదం మోపేందుకు స్వయంగా..

ఉత్తర తెలంగాణలో పెరుగుతున్న మావోయిస్టుల కదలికలను కట్టడి చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు త్రిముఖ వ్యూహాన్ని రచిస్తున్నారు. మావోలపై ఉక్కుపాదం మోపేందుకు స్వయంగా డీజీపీ మహేందర్‌రెడ్డినే రంగంలోకి దిగడం పోలీసుల ప్రణాళికను వెల్లడిస్తోంది. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అయిదు రోజులపాటు డీజీపీ మకాం వేశారు. ములుగు జిల్లా వెంకటాపురంలో కేంద్ర హోంశాఖ, సీఆర్పీఎఫ్‌, ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇక మావోల కోసం ప్రత్యేక హెలికాఫ్టర్‌ ద్వారా అడవులను జల్లెడ పడుతున్నారు పోలీసులు.

తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణకు కీలకంగా పనిచేస్తున్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో బలోపేతంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇటీవల అదనపు ఎస్పీ మురళీధర్‌ బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో పనిచేసిన అనుభవమున్న అదనపు ఎస్పీ బల్ల రాజేశ్‌ను నియమించారు. గతంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పనిచేసి అదనపు ఎస్పీగా పదవీ విరమణ పొందిన దయానంద్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన అదనపు ఎస్పీ శ్రుతకీర్తిని నియమించారు. వీరికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉండటం ప్రాధాన్యం సంతరించుకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు వాట్సప్‌ కాల్స్‌లోనే మాట్లాడుతున్నట్లు సమాచారం ఉండటంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించేందుకే తాజా నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

పోలీస్‌ అకాడమీ నుంచి ఈ నెల 7న కానిస్టేబుళ్లు బయటికి రానుండటంతో వారిలో పది ప్రత్యేక బృందాల్ని తయారుచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వీరిని ఏరియా డామినేషన్‌ పార్టీలుగా వినియోగించనున్నట్లు తెలుస్తోంది. గ్రేహౌండ్స్‌తో నిమిత్తం లేకుండా నిత్యం అడవుల్లో కూంబింగ్‌ చేసేలా తీర్చిదిద్దనున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతాల్లో మావోయిస్టు అగ్రనేతలు కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌, కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌తో పాటు మణుగూరు లోకల్‌ ఏరియా స్క్వాడ్‌ కమాండర్‌ సుధీర్‌ సంచరిస్తుండటంతో... వీళ్లను కూంబింగ్‌తో నియంత్రించొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇదిలాఉండగా మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ప్రజాసంఘాల నేతలపై పోలీసులు గద్వాల, నల్లకుంట, చర్ల, గజ్వేల్‌, ఎల్‌బీనగర్‌.. తదితర ప్రాంతాల్లో మొత్తం 8 కేసులు నమోదు చేశారు. కానీ ఏ ఒక్క కేసులోనూ పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేయకపోవడంతో నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయించడంపై ఎస్‌ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు దృష్టి సారించారు.

Tags

Read MoreRead Less
Next Story